కుల్గామ్.. మరో పహల్గామ్: భారీ ఎన్ కౌంటర్- జవాన్లు వీరమరణం
జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపటి కిందటే ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు.
వీరమరణం పొందిన జవాన్లను చినార్ కార్ప్స్ కు చెందిన లాన్స్ నాయక్ ప్రీత్పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్ గా గుర్తించారు. ఈ విషయాన్ని చినార్ కార్ప్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పొందుపరిచింది. అమరవీరులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది.

దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులు ల్యాన్స్ నాయక్ ప్రీత్పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్లకు చినార్ కార్ప్స్ సగౌరవంగా నివాళులర్పిస్తోందని పేర్కొంది. వారి ధైర్యం, అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆర్మీ పేర్కొంది.
ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో మాటువేసినట్లు సమాచారం అందడంతో కుల్గామ్ సమీపంలోని అడవులు, పర్వత శ్రేణులను జవాన్లు జల్లెడ పడుతున్నారు. దీనికి ఆపరేషన్ అఖాల్ అని పేరుపెట్టింది భారత ఆర్మీ. నెల 1వ తేదీన ఎన్ కౌంటర్ ఆరంభమైంది. తొమ్మిదో రోజుకు చేరుకుంది.
జమ్మూ కాశ్మీర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ఇదే. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయి పోలీసు, ఆర్మీ కమాండర్లతో ఓ జాయింట్ టీమ్ ఏర్పడింది. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని నిరంతరం సందర్శిస్తోందీ టీమ్. కఠినమైన భూభాగం, దట్టమైన అటవీ ప్రాంతం, ప్రతికూల వాతావరణం కారణంగా ఉగ్రవాదుల ఏరివేతలో జాప్యం ఏర్పడుతోందని జమ్మూ కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ నళిన్ ప్రభాత్ తెలిపారు.
ఈ ఆపరేషన్ ను నళిన్ ప్రభాత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్లోని అఖల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులు ఆరంభమైన రెండో రోజు ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఆ తరువాత మరో ఇద్దరిని స్పెషల్ టీమ్ ఎన్ కౌంటర్ చేసింది.
Update: OP AKHAL, Kulgam
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 2, 2025
Intermittent and Intense fire fight continued through the night. Alert troops responded with calibrated fire and tightened the nooze while maintaining contact.
One terrorist has been neutralised by the security forces so far.
Operation continues.…
హతమైన ఉగ్రవాదుల గుర్తింపు, ఏ గ్రూపుకు చెందినవారనేది ఇంకా నిర్ధారణ కాలేదు.ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్లను వినియోగిస్తోన్నాయి. పారా కమాండోలు కూడా రంగంలోకి దిగారు. మరో అయిదుమంది ఉగ్రవాదులు మిగిలివున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. వారిలో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉండొచ్చని భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications