ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఐదుగురు దోషులు, 17న శిక్ష ఖరారు
పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం 2010 నవంబర్ 24వ తేదీన కాల్ సెంటర్లో ఉద్యోగం చేసే ఈశాన్య రాష్టాలకు చెందిన 30 ఏళ్ల మహిళ సాయంత్రం నడిచి ఇంటికి వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు ఆమెపై మంగోల్పురి ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను పడేసి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఈ ఐదుగురిని హర్యానాలోని మేవాట్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో మేము అమాయకులమని, ఎవరో కావాలనే ఈ కేసులో మమ్మల్ని ఇరికించారని వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులైన శంషాద్ ఆలియాస్ కుటకన్, ఉస్మాన్ అలియాస్ ఖాలీ, షాహిద్ అలియాస్ ఛోటా బిల్లి, ఇక్బాల్ అలియాస్ బడా బిల్లి, కమ్రుద్దిన్లను నేడు దోషులుగా ఢిల్లీ సెషన్స్ కోర్టు జడ్జి వీరేందర్ భట్ నిర్దారించారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్న కాల్ సెంటర్ కంపెనీలు తమ ఉద్యోగస్తులను సెక్యూరిటీతో పాటుగా ఇంటి వరకు దిగబెడుతున్నాయి.