మరొకరితో సన్నిహితంగా.?: బతికే అర్హత లేదంటూ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
తిరువనంతపురం: కేరళలోని చెంగలూరులో గత ఆదివారం చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన భార్యకు జీవించే అర్హత లేదంటూ ఓ వ్యక్తి కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలపాలైన బాధితురాలు మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

తరచూ గొడవలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరచూ గొడవల నేపథ్యంలో త్రిసూర్కు చెందిన 23ఏళ్ల జీతూ నెల రోజుల నుంచి భర్త విరాజ్కు దూరంగా ఉంటోంది. విడాకుల కోసం దాఖలు చేసుకున్న రోజు నుంచి పుట్టింటి వద్దే నివసిస్తోంది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ తన తండ్రితో కలిసి ఆదివారం చెంగలూరులోని పేదలు, మహిళలకు సాయమందించే కుదుంబశ్రీ కార్యాలయానికి వెళ్లింది.

పెట్రోల్ పోసి నిప్పంటించాడు
ఈ ఆఫీసు ఆమె భర్త విరాజ్ ఇంటికి వంద మీటర్లలోపే ఉండటంతో.. అతడు ఆగ్రహంతో అక్కడి చేరుకున్నాడు. అప్పుడే కుదుంబశ్రీ కార్యాలయం నుంచి బయటికి వస్తున్న జీతూపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతుందో అక్కడున్నవారు తెలుసుకునేలోపే విరాజ్ ఘటన స్థలం నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ సూసైడ్ లెటర్ అంటూ ఓ లేఖ అక్కడ పడేసి వెళ్లాడు.

బతికే అర్హత లేదంటూ..
‘ఆమెకు బతికే హక్కు లేదు కాబట్టే చంపేశా' అంటూ విరాజ్ ఆ లేఖలో పేర్కొన్నాడు. జీతూ తనను మోసం చేసిందనీ.. భారీ ఎత్తున అప్పులు చేయించిందని తెలిపాడు. తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాననీ.. జీతూకి కూడా బతికే హక్కు లేదని ఆ లేఖలో పేర్కొన్నాడు.

మరొకరితో సన్నిహతంగా భార్య..?
తన కుటుంబానికి, చుట్టు పక్కల వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆ లేఖలో విరాజ్ తెలిపాడని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విరాజ్ కోసం గాలింపు చేపట్టారు. గల్ప్లో కొంతకాలం పనిచేసి వచ్చిన విరాజ్.. స్థానికంగా వెల్డింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, నెల రోజుల క్రితం మరో వ్యక్తితో తన భార్య సన్నిహితంగా ఉండటాన్ని చూసిన నాటి నుంచి విరాజ్.. జీతూతో గొడవపడుతున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications