తెలంగాణ: 25 మంది సీమాంధ్ర ఎంపీలపై చర్య?
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై చర్చను సాగించి, ఆమోదించడానికి వీలుగా 25 మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లోకసభ స్పీకర్ మీరా కుమార్కు సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన సమయంలో జరిగిన సంఘటనలను ఆసరా చేసుకుని వారిపై చర్యలకు దిగవచ్చునని అంటున్నారు. స్పీకర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ, పోలీసు శాఖ చర్యలు చేపడతాయని కమల్ నాథ్ చెప్పారు. లోకసభలో కాంగ్రెసు నుంచి బహిష్కరణకు గురైన లగడపాటి రాజగోపాల్ లోకసభలో మిరియప్పొడి చల్లగా, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చాకు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాను చాకు తీయలేదని మోదుగుల అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు పార్లమెంటు చరిత్రలో మచ్చలాంటివని, 25 మంది ఎంపీల గుంపు సభను అదుపులోకి తీసుకోలేదని కమల్ నాథ్ అన్నారు. వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని తాము సూచిస్తామని ఆయన పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ బిల్లుపై చర్చ జరిగేలా చూసి, ఆమోదింపజేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చర్చ, ఓటింగు సందర్భంగా సభను ఎలా సజావుగా నడపాలో చేయాల్సిన బాధ్యత స్పీకర్దేనని ఆయన అన్నారు. హింసకు దిగే బదులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం సభ్యులకు ఉంటుందని మంత్రి రాజీవ్ శుక్లా అన్నారు.
తెలంగాణ బిల్లుపై ఈ నెల 19వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటును ఆమోదించిన తర్వాత చర్చను చేపట్టే అవకాశం ఉంది. ఈ నెల 21వ తేదీ వరకే పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. దీంతో ఉభయ సభల్లోనూ ఈలోగా తెలంగాణ బిల్లును ఆమోదించుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications