కాల్పులు: పౌరుడు మృతి, ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కుప్వారా జిల్లాలోని టాంగ్దర్ సెక్టార్లో సైనిక శిబిరాల వద్ద ఉగ్రవాదులు- భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. హోరాహోరీ కాల్పుల్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
బుధవారం ఉదయం తంగ్దార్ సెక్టార్పై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. సుమారు ఏడుగంటల పాటు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ సాధారణ పౌరుడు కూడా మృతిచెందాడు.
తంగ్దార్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం వెనుక నుంచి ఉగ్రవాదులు ఉదయం 6.15 నిమిషాలకు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉంటారని భావిస్తున్నారు. శ్రీనగర్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంగ్దార్ క్షేత్రానికి ఉగ్రవాదులు గ్రేనేడ్ లాంచర్లు, చిన్న తరహా పేలుడు పదార్ధాలతో వచ్చారు.
ఉదయమే భీకర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీకి చెందిన కొన్ని వాహనాలు, టెంట్లు ధ్వంసం అయ్యాయి. అయితే క్యాంపులో ప్రవేశించడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఆ సమయంలో బేస్ క్యాంపులో సుమారు 80 మంది సైనికులున్నారు.
కుప్వారా జిల్లాలోని మానిఘర్ ప్రాంతంలో గత రెండు వారాలుగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. గత వారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 38 ఏళ్ల ఆర్మీ కల్నల్ సంతోష్ మహాదిక్ కన్నుమూశారు.