దేశంలో 6.6 శాతంగా తగ్గిన కరోనా కొత్త కేసులు, 500 లోపే మరణాలు: కేరళలోనే సగం కంటే ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగతుంది. అయితే, క్రమంగా దేశంలో కొత్త కేసులు తగ్గుతున్నాయి. తాజాగా, 40వేలకు దిగువనే కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి. మరణాలు కూడా 500కు దిగువనే ఉన్నాయి. తాజాగా, నమోదైన కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దేశంలో 36వేల కొత్త కరోనా కేసులు, 493 మరణాలు
గత 24 గంటల వ్యవధిలో భారతదేశంలో 19,23,863 నమూనాలను పరీక్షించగా 36,083 కరోనావైరస్ కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇది ముందు రోజు కంటే 6.6 శాతం తక్కువ కావడం గమనార్హం. శనివారంనాడు కరోనా బారినపడి 493 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4,31,225కు చేరింది. ఇక కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

దేశంలో 3,85,336 యాక్టివ్ కేసులు
తాజాగా, 37,927 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,13,76,015కి చేరింది. రికవరీ రేటు 97.46 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,85,336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. శనివారం ఒక్కరోజే 73,50,553 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 54,38,46,290కి చేరింది.

కేరళలో తగ్గని కరోనా ఉధృతి.. దేశంలో సగం కంటే ఎక్కువ ఇక్కడే
కాగా, కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, కేరళలంో 19,451 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల్లో ఇక్కడే సగానికంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. కేరళలో ప్రస్తుతం 13.97 శాతంగా పాజిటివిటీ రేటు ఉంది.
సెకండ్ వేవ్లో భారీగా కేసులు నమోదైన మహారాష్ట్రంలో తాజాగా, 5787 కరోనా కేసులు నమోదు కాగా, 179 మరణాలు సంభవించాయి. ముంబైలో ఐదుగురు మరణించారు. ఈ నేపథ్యంలో రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవారికే మహారాష్ట్రలో ప్రవేశం అనే నిబంధనను సర్కారు విధించింది. పంజాబ్ రాష్ట్రం కూడా ఇదే నిబంధనను విధించింది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 50 కొత్త కేసులు నమోదు కాగా, ఒక మరణం సంభవించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 478 యాక్టివ్ కేసులున్నాయి. అస్సాంలో గత 24 గంటల్లో ఐదు మరణాలు సంభవించాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5482కు చేరింది.
మొత్తం కేసుల సంఖ్య 5,79,488కి చేరింది. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ తోపాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తు్న్నారు. మరోవైపు అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఆంక్షలను సడలించడంతోనే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లోని ప్రజలను బయటికి రాకుండా చర్యలు తీసుకుంటోంది.
ప్రపంచ వ్యాప్తంగా 200 కరోనావైరస్ కేసుల సంఖ్య మిలియిన్ మార్కును దాటింది. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మరోసారి కరోనా విజృంభణకు అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications