బీజేపీని వీడనున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు: శరద్ పవార్, జనవరి 20 వరకు రోజుకో మంత్రి, ఎమ్మెల్యే!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు, పది మందికిపైగా ఎమ్మెల్యేలు యూపీలో అధికార బీజేపీ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాగా, మరోసారి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడతారని జోస్యం చెప్పారు.
బీజేపీని వీడనున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు: శరద్ పవార్
'బీజేపీని ఆ పార్టీ నేతలు వీడని ఒక్క రోజు కూడా లేదు. ఉదాహరణకు యూపీని తీసుకుంటే.. 13 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడి మరో పార్టీలో చేరుతున్నారని.. ఈరోజే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని నాకు తెలిసింది' అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.
ఎస్పీతో కలిసి యూపీ ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ..
ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని, ఒక సీటు ప్రకటించామని, మిగతా సీట్ల కోసం చర్చలు జరుగుతున్నాయని, యూపీలో ఏర్పడే కూటమికి తమ మద్దతు ఉంటుందని నవాబ్ మాలిక్ చెప్పారు.
జనవరి 20 వరకు రోజుకో మంత్రి, ఎమ్మెల్యే బీజేపీని వీడతారు: షైనీ
గురువారం బిజెపిని వీడి సమాజ్వాదీ పార్టీతో చేతులు కలిపిన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ధరమ్ సింగ్ సైనీ ఆజ్ తక్తో మాట్లాడుతూ.. "జనవరి 20 వరకు ప్రతి రోజు ఒక యూపీ మంత్రి, ఒక బిజెపి ఎమ్మెల్యే రాజీనామా చేస్తారు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు బీజేపీని ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించగా.. తన వాదనను ఎవరూ వినిపించుకోలేదని చెప్పారు. నేను చెప్పేది వినేవారు లేరని, ఒకప్పుడు 140 మంది ఎమ్మెల్యేలు ధర్నాకు దిగి బెదిరింపులకు గురయ్యారని ధరమ్ సింగ్ అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార బీజేపీ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీని వీడారు. తాజాగా, మరికొందరు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్సీపీ, ఎస్పీ నేతలు అంటున్నారు. బీజేపీని వీడుతున్న నేతలు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీకి కొంత కలిసివచ్చే అంశంగా మారింది.