ఆరుగురు టీఎంసీ సభ్యులను సస్పెండ్ చేసిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేసిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులను ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్ చేశారు.
బుధవారం పార్లమెంటు సమావేశాల్లోనూ పెగాసస్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలను కొనసాగించాయి. మరోవైపు కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడా నిరసనలు చేస్తున్నాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని, విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదాలు పడుతూ కొనసాగుతున్నాయి.

ప్లకార్డులను ప్రదర్శించడంతోపాటు వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యులు ఆందోళన విరమించాలని, తమ తమ సీట్లలో కూర్చోవాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడు పలుమార్లు సూచించినప్పటికీ.. విపక్ష సభ్యులు పట్టించుకోకుండా ఆందోళనలను కొనసాగించారు. దీంతో ప్లకార్డులు పట్టుకున్నందుకు 255 నిబంధనను అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా వినకపోవడంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
ఆ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగాయి. దీంతో సెక్రటేరియట్ నిబంధనకు గురైన సభ్యుల పేర్ల జాబితాను రాజ్యసభ విడుదల చేసింది. టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలు డోలా సెన్, మహ్మద్ నదీముల్ హక్, శాంత చెత్రి, అబిర్ రంజన్ బిశ్వాస్, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్ను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైననాటి నుంచి కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారని విపక్షాలను దుయ్యబట్టారు. ఇప్పటికే విపక్షాల ఆందోళన కారణంగా సుమారు రూ. 130 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications