CJI NV Ramanaకు లెటర్..ఆర్ట్ పెయింట్ కూడా: గుండెను టచ్ చేసిందటూ చీఫ్ జస్టిస్ రిప్లై
తిరువనంతపురం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అందిన ఓ లెటర్.. ఆయన ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. తన ఆనందాన్ని దాచుకోలేకపోయిన ఆయన.. వెంటనే దానికి బదులు కూడా ఇచ్చారు. దీన్ని బ్యూటిఫుల్ లెటర్గా అభివర్ణించారు. ఈ లెటర్ తన హృదయాన్ని తాకిందంటూ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల ఔన్నత్యాన్ని పెంచిందని, వారి బాధ్యతలను మరింత రెట్టింపు చేసిందని ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఓ పదేళ్ల బాలిక ఈ ఉత్తరాన్ని రాయడం ఆనందంగా.. అంతకంటే గర్వంగా ఉందని కితాబిచ్చారు.
త్రిశూర్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని రాసిన లెటర్..
కేరళ నుంచి వచ్చిన లెటర్ అది. ఓ పదేళ్ల బాలిక దాన్ని చీఫ్ జస్టిస్కు రాశారు. ఆమె పేరు లిడ్వానా జోసెఫ్. అయిదో తరగతి విద్యార్థిని. త్రిశూర్లోని కేంద్రీయ విద్యాలయలో లిడ్వానా అయిదో తరగతి చదువుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నివారించడానికి సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే.
అలాగే- కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం నిలదీసింది. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం- రాష్ట్రాల మధ్య ఉన్న తేడాను ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న వ్యాక్సినేషన్ పాలసీని సుప్రీంకోర్టు ఎండగట్టింది. ఆక్సిజన్ సరఫరాపై కీలక ఆదేశాలను ఇచ్చింది.
కరోనా కేసులు తగ్గడంలో సుప్రీం కీలకం..
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని లిడ్వానా జోసెఫ్.. సుప్రీంకోర్టును ప్రశంసిస్తూ, ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి ఈ లేఖ రాశారు. దేశ రాజధానితో పాటు పలు రాష్ట్రాల్లో సంభవిస్తోన్న కరోనా మరణాలు తనను కలచి వేశాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింట్లో సకాలంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని తాను గమనించానని చెప్పారు.
అన్ని రాష్ట్రాలకు సకాలంలో ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని లిడ్వానా తన లేఖలో చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంలో, మరణాలు అదుపులోకి రావడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిందని అన్నారు. ఈ లెటర్తో పాటు ఎన్వీ రమణ ఆర్ట్ పెయింట్ను వేశారు లిడ్వానా. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వెబ్సైట్ ది హిందూ దీన్ని ప్రత్యేక కథనంగా ప్రచురించింది.
తన సంతకంతో కూడిన రాజ్యాంగం ప్రతిని బహుమానంగా..
ఈ లెటర్ అందిన వెంటనే ఎన్వీ రమణ.. ఆ బాలికకు ప్రత్యుత్తరమిచ్చారు. దానితోపాటు- తాను సంతకం చేసిన రాజ్యాంగం ప్రతిని ఆమెకు పంపించారు. ఈ ఉత్తరాన్ని బ్యూటిఫుల్గా అభివర్ణించారాయన. విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి ఆర్ట్ పెయింట్ తనకు అందిందని చెప్పారు.
ప్రాథమిక విద్యాభ్యాస దశలోనే దేశం పట్ల అవగాహన ఏర్పడటం, తన చుట్టూ ఏం జరుగుతోందనే విషయాన్ని నిశితంగా పరిశీలించే సామర్థ్యాన్ని పుణికి పుచ్చుకోవడం స్వాగతించదగ్గ విషయమని చెప్పారు. భవిష్యత్లో బాధ్యతాయుతమైన దేశ పౌరురాలిగా ఎదుగుతావని ఎన్వీ రమణ.. ఆ బాలికను ఆశీర్వదించారు. దేశ నిర్మాణంలో ఇలాంటి విద్యార్థుల పాత్రే కీలకమని అన్నారు.