వర్షాల దెబ్బ: కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం: శిథిలాల మధ్య:
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొద్దిరోజులుగా భారీ నుంచి అతి వర్షాలు కురుస్తోన్నాయి. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో భారీ వర్షాలు ఎడతెరిపినివ్వట్లేదు. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పలు చోట్ల వర్షపు నీరు నిలిచింది.
121 సంవత్సరాల తరువాత ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. శనివారం సంభవించిన కుంభవృష్టికి ఢిల్లీ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు మునిగి పోయాయి. ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులోకి భారీగా వరదనీరు చేరింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. రన్వేలు, ఎయిర్పోర్టు సమీపంలోని హోటళ్లు నీటిలో చిక్కుకున్నాయి. మూడు విమానాలు రద్దు అయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించారు.

ఈ భారీ వర్షాల ధాటికి ఢిల్లీ సబ్జీ మండిలోని ఓ భారీ భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఉదయం 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా నేలమట్టమైంది. కొద్దిరోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా..ఈ ఘటన సంభవించినట్లు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్నిమాపక దళాలు అనుమానిస్తోన్నాయి. భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకుని ఉండొచ్చని భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను చేపట్టాయి.
ఇప్పటిదాకా ముగ్గురిని సురక్షితంగా వెలికి తీసినట్లు ఢిల్లీ సెంట్రల్ రేంజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎన్ఎస్ బుందేలా తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయి. ఇద్దరు పిల్లలు, ఒక వ్యక్తిని సురక్షితంగా కాపాడామని అన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి ఎనిమిది అగ్నిమాపక శకటాలు తరలించామని, జేసీబీలను రప్పించి.. శిథిలాలను తొలగిస్తున్నామని అన్నారు.

స్థానిక పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బుందేలా తెలిపారు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో అంచనా వేయడానికి సమయం పడుతుందని అన్నారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్థానికుల్లో స్పష్టత లేదని చెప్పారు.
కాగా, ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీన్ని దురదృష్టకరమైన ఘటనగా అభివర్ణించారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. సహాయక చర్యలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. మృతుల సంఖ్యను తగ్గించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications