మోడీకి కేరళ అమ్మాయి ఛాలెంజ్..!
తిరువనంతపురం : ఆపదలో ఉన్నవారు, ఆర్థిక సహాయాన్ని కోరేవారు గతంలో చాలామంది.. దేశ ప్రధానులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీకి కూడా పలు విషయాల్లో సహాయాన్ని ఆర్థిస్తూ ఆయా సందర్భాల్లో కొన్ని లేఖలు అందాయి.
అయితే ఇవన్నీ వాళ్ల వ్యక్తిగత సహాయం నిమిత్తమై వచ్చిన లేఖలు కాగా, తాజాగా ఓ కేరళ అమ్మాయి సమాజ హితాన్ని కోరుతూ ప్రధాని మోడీకి ఏకంగా ఓ వీడియోనే పంపించింది. కేరళలోని త్రిసూర్ లో 10వ తరగతి చదువుతున్న ఆనీ రిబు జోషి (15) దేశంలో డ్రగ్స్ కార్యకలాపాలను మట్టుపెట్లాలని కోరుతూ ప్రధాని మోడీకి తన అభ్యర్థనను వీడియో ద్వారా పంపింది.
డ్రగ్స్ వాడకం వల్ల సంభవిస్తున్న దుష్పరిమాణాల గురించి వీడియోలొ వివరించిన రిబు జోషి, డ్రగ్స్ ఉగ్రవాదం కంటే తీవ్రమైందని, దేశంలో వాటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ప్రధానిని కోరింది. ఇందుకోసం 'స్పందించండి.. మోడీజీ సహాయం చేయండి..' అంటూ తను రూపొందించిన వీడియో ద్వారా మోడీకి విన్నవించింది.
గతంలో మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తుచేసిన రిబు జోషి.. 'మీరు గతంలో ఓసారి చెప్పారు, ప్రతి సిటిజన్ ఆరోగ్యంగా ఉన్పప్పుడే దేశం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని, కానీ చుట్టూ ఇంతగా డ్రగ్స్ మాఫియా విస్తరించినా..! దేశం ఆరోగ్యకరంగా ఉందనే భావనలోనే మీరింకా ఉన్నారా..?' అని ప్రధానిని ప్రశ్నించింది.
డ్రగ్స్ మాఫియా గురించి నాన్ స్టాప్ గా మాట్లాడిన రిబు జోషి విస్తరిస్తున్న డ్రగ్ మాఫియా దేశాభివృద్దికి ఆటంక కలిగిస్తుందన్న పేర్కొంది. డ్రగ్స్ పై దేశ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మోడీ పాటు పడాలని కోరింది. ఆరు నిమిఫాల నిడివి గల రుబు జోషి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది.
డ్రగ్స్ మాఫియాపై తన పోరాటం రిబు జోషి గురించి వివరణ ఇచ్చుకుంది. కాలేయ క్యాన్సర్ కారణంగా తండ్రిని పోగొట్టుకున్న తాను స్నేహితులు, కొంతమంది వ్యక్తులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఫార్ట్యూన్ అనే ఓ వేదికను ఏర్పాటు చేసుకుని మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టుగా తెలిపింది.