దేవాలయంలో బీజేపీ లేడీ ఎమ్మెల్యే, చేదు అనుభవం, గంగా జలంతో శుద్ది, దళిత కులం !
Recommended Video
లక్నో: ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైయ్యింది. బీజేపీ మహిళా ఎమ్మెల్యే పూజలు చేసిన ఆలయంలో గంగాజలంతో శుధ్ది చేసి విగ్రహాలను ప్రయాగ (శుద్ది) చేయించారు. తమ ఆచారాలను మంటగలపాలని చూస్తే సహించమని గ్రామస్తులు హెచ్చరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ లోని రాత్ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే మనీషా అనురాగి (దళిత) తన పర్యటనలో భాగంగా జులై 12వ తేదీ హమీర్పూర్ జిల్లాలోని మస్కారా ఖుర్జ్ గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో కార్యకర్తలు ఒత్తిడి చెయ్యడంతో గ్రామంలోని ధ్రుమ్ రుషి ఆలయంలో ఎమ్మెల్యే మనీషా ప్రత్యేక పూజలు చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో గ్రామ పెద్దలు సైతం మనీషాను అడ్డుకోలేకపోయారు. ఎమ్మెల్యే మనీషా వెళ్లిపోయిన తరువాత గ్రామ పెద్దలు ఆలయాన్ని గంగాజలంతో శుద్ది చేశారు. అంతే కాకుండా దేవాలయంలోని విగ్రహాలను ప్రయాగకు పంపించారు.
మహాభారతం కాలం నాటి ఈ ఆలయంలో మహిళలు, దళితులు ప్రవేశించరాదని స్థానికులు నియమాలు పెట్టారు. అయితే దళితురాలు అయిన మహిళ ఎమ్మెల్యే ఆలయంలో ప్రవేశించారని, అంతే కాకుండా రుషి ధ్యానం చేసిన ప్రాంతంలో ఆమె కాలు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దళిత మహిళ దేవాలయంలో ప్రవేశించడంతో తమకు కీడు జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని, వారి భయం పోగొట్టడానికి ఆలయాన్ని గంగాజలంతో శుద్ది చేయించామని గ్రామ పెద్దలు అంటున్నారు. మా ఆచారాల మంటగలపడానికి ప్రయత్నిస్తే ఇక ముందు తాము సహించమని గ్రాస్తులు హెచ్చరిస్తున్నారు.