డిప్యూటీ సీఎం కారు నుజ్జు నుజ్జు..
చండీగఢ్: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ సహా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత సింగిల్ డిజిట్కు పడిపోతోంది. రికార్డుస్థాయిలో పతనమౌతోంది. పగటి ఉష్ణోగ్రత సైతం సాధారణం కంటే తక్కువ డిగ్రీలకు నమోదవుతోంది. పొగమంచు కమ్ముకోవడం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు రైళ్లు రద్దవుతున్నాయి. మరి కొన్ని ఆలస్యంగా రాకపోకలు సాగిస్తోన్నాయి.
పొగమంచు దట్టంగా అలుముకోవడం వల్ల ఎదురుగా ఏమున్నది కూడా తెలియట్లేని పరిస్థితి నెలకొంది. దీనితో ఎక్స్ప్రెస్ వేలపై తరచూ ప్రమాదాలు సంభవిస్తోన్నాయి. పలువురు గాయపడుతున్నారు. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనాలు రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ వేలపై పొగమంచు వల్ల ప్రమాదాలు సంభవిస్తోండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన అలాంటి ప్రమాదాల్లో అదృష్టవశావత్తూ ప్రాణనష్టం నమోదు కావట్లేదు.

హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కారు కూడా పొగమంచు వల్ల ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. హిస్సార్ నుంచి సిర్సాకు బయలుదేరి వెళ్తోండగా మార్గమధ్యలో అగ్రొహ వద్ద దుష్యంత్ చౌతాలా కారుకు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఏమీ కనిపించకపోవడంతో ఆయన కాన్వాయ్లోని పోలీస్ కమాండ్ వాహన డ్రైవర్ సడన్గా బ్రేకులు వేశారు.
దీనితో ఆ వాహనం వెనకలే వస్తోన్న దుష్యంత్ చౌతాలా కారు వెనుకవైపు నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఉప ముఖ్యమంత్రి కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. దుష్యంత్ చౌతాలా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో పోలీస్ కమాండర్ ఒకరికి గాయాలయ్యాయి. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. కొద్దిసేపటి తరువాత మరో వాహనంలో ఆయన సిర్సాకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications