యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి: చేతికి గుచ్చివున్న ఇంజెక్షన్!
ముంబై: ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి చేతికి ఇంజెక్షన్ గుచ్చి ఉండటంతో.. మెడిసిన్ ఓవర్డోస్ ద్వారా ఆమె ఆత్యహత్యకు పాల్పడిందా? లేఖ మరేదైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో జరిగిన ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొల్హాపూర్కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ చంద్ర హెంద్రే కుమార్తె డాక్టర్ అపూర్వ హెంద్రే(30).. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తోంది. శనివారం రాత్రి ఆమె ఓ కార్యక్రమానికి హజరై కాస్త ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. అనంతరం కాసేపటికే మళ్లీ బయటకు వెళ్లింది. కానీ, ఈ సారి వెళ్లేటప్పుడు ఇంటి తలుపులకు బయట నుంచి తాళం వేసుకుని వెళ్లింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు.. పెరటి ద్వారం ద్వారా బయటకు వచ్చి రాత్రంతా ఆమె కోసం వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు.
చేసేదేం లేక ఆదివారం ఉదయం.. అపూర్వ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు. ఈ లోపల ఆయనకు ఓ కాల్ వచ్చింది. ' మీ కుమార్తె నడిరోడ్డుపై విగతజీవిగా పడి ఉంది' అని ఓ వ్యక్తి ఫోన్లో చెప్పారు. వెంటనే ప్రవీణ్ చంద్ర.. పోలీసుల దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పి.. వారితో ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆమె చేతికి ఇంజెక్షన్ గుచ్చి ఉంది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న సీపీఆర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
అంతేగాక, అపూర్వ హ్యాండ్ బ్యాగ్లో మెడిసిన్ బాటిల్, మరో రెండు ఇంజెక్షన్లు కూడా లభ్యమయ్యాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అసలు ఆ మెడిసిన్ ఏంటి? ఓవర్ డోస్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లనే ఆమె చనిపోయిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు.. అపూర్వది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వైద్యురాలు సేవలందించాల్సిన తమ కూతురు విగతజీవిగా మారడంతో వైద్యురాలి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.