ఢిల్లీ ఎన్నికలు: ఆప్ అభ్యర్ధి వాహనంపై దాడి, పలు అనుమానాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్ధి వాహనంపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. ఢిల్లీలోని రోహ్తక్ నాగూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి సరితాసింగ్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో తూర్పు ఢిల్లీ ప్రాంతంలో సరితాసింగ్ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తి తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో దుండగులు ఇనుప రాడ్లు, చెక్క క్లబ్లు ఉపయోగించారని అన్నారు. ఐతే ఈ ఘటనలో ఆప్ అభ్యర్ధి క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై ఎప్ఐఆర్ నమోదు చేయలేదని, విచారణ జరపుతున్నట్లు తెలిపారు. ఐతే ఈ దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పలు అనుమానలు వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉంటే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కార్యాలయంపై కూడా సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కిరణ్ బేడీ పోటీ చేస్తున్న కృష్ణా నగర్లోని కార్యాలయం పైన జరిగిన ఈ దాడిలో భవనం అద్దాలు పగిలిపోయాయి.
దాడి సందర్బంగా కార్యాలయంలో ఉన్న కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి పైన సమాచారం అందుకున్న కిరణ్ బేడీ తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లారు. దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.
ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ-ఆప్ పార్టీలకు చెందిన అభ్యర్ధలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న అసెంబ్లీ ఫలితాలు వెల్లడించనున్నారు.