కేజ్రీ పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్పై దాడి, నేతలకు సిఎం హితవు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత, ఎమ్మెల్యే మనోజ్ కుమార్ కార్యాలయం పైన కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఓ మహిళ సహా సుమారు యాభై మంది మనోజ్ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని కోండ్లి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ ఘటనపై శాసన సభ్యులు మనోజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ, ఆమెతో వచ్చిన వారు తమ కార్యాలయం పైన దాడి చేశారని, ఈ ఘటనలో తాను మరో ఇద్దరు గాయపడ్డారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

మరోవైపు తమను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బంధించి కొట్టారని దాడికి పాల్పడిన వారు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు అందాయి.
కాగా, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)కి చెందిన వారు ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని బిఎస్పీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షులు బ్రహ్మ సింగ్ ఖండించారు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ తమ పార్టీకి చెందిన వారెవరూ లేరని ఆయన చెబుతున్నారు.
మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ఎలాంటి విభేదాలు ఉన్నా ఆయన చాలా మంచివారని, తానంటే ఆయనకు చాలా అభిమానమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎఎపి నేతలు విమర్శలు చేసే సమయంలో తమ భాష పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్ సూచించారు. ఎఎపి నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ను కాంగ్రెసు ఏజెంటుగా ఆరోపించడంపై కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications