ప్రధాన్ రాజీనామా డిమాండ్ బ్యాక్ ఫైర్..! మరో విద్యామంత్రి మెడకు ? సర్కార్ కే ముప్పు..!
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి బాథ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్ధులు ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించడం ప్రారంభించారో.. అప్పుడే విపక్షాలు అందులో దూరాయి. అవును ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆందోళనలకు మద్దతిచ్చేందుకు పోటీ పడ్డాయి. ఇలా ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి ఇప్పుడు పంజాబ్ లో షాక్ తప్పేలా లేదు.
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం చేపట్టిన ఆందోళనలకు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు మరో కీలక నేత మనీష్ సిసోడియా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా సిసోడియా చేసిన కొన్ని వ్యాఖ్యలు పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్కు కొత్త రాజకీయ తలనొప్పులు తెచ్చిపెట్టాయి. పంజాబ్లో గత నాలుగేళ్లుగా ఒక్క పరీక్ష పేపర్ కూడా లీక్ కాలేదని, ఒకవేళ అలాంటి లీకేజీ జరిగితే తమ విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగిస్తామని సిసోడియా సవాల్ విసిరారు. ఈ సవాల్ను ఇప్పుడు అందిపుచ్చుకున్న పంజాబ్లోని కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఆప్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ముమ్మరం చేశాయి. పంజాబ్లో ఆప్ పాలనలో జరిగిన పలు విద్యా, ఉద్యోగ రిక్రూట్మెంట్ పరీక్షల లీకేజీలను ప్రతిపక్షాలు వరుసగా వేలెత్తి చూపుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఫార్మసీ అధికారుల నియామక పరీక్షలో చోటుచేసుకున్న కాపీయింగ్ కుంభకోణంతో పాటు, గతంలో రద్దయిన 12వ తరగతి ఇంగ్లీష్ బోర్డు పరీక్ష పేపర్ లీక్ ఉదంతాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేసిన ఆప్ నేతలు, పంజాబ్కు వచ్చేసరికి ఆ సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ దీనిపై పార్లమెంట్ వెలుపల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఒకవైపు సవాళ్లు విసురుతూ, మరోవైపు తమ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఎలా రక్షిస్తారని సిసోడియా, భగవంత్ మాన్ ను ప్రశ్నిస్తున్నాయి.

ఈ ఆరోపణలను పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తీవ్రంగా తిరస్కరించారు. వివాదాస్పద ఫార్మసీ పరీక్ష తన శాఖ పరిధిలోకి రాదని, అది ఆరోగ్య శాఖ అధికారాల కిందకు వస్తుందని ఆయన స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా అది పేపర్ లీక్ కాదని, కేవలం కొందరు అభ్యర్థులు చేసిన చిన్న కాపీయింగ్ ప్రయత్నమని వివరించారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి వెల్లడించారు. వచ్చే ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాల్లో ఈ విద్యాశాఖ పరీక్షల వ్యవహారం అత్యంత కీలకమైన అంశంగా మారింది. కేంద్రంపై పోరాటంలో భాగంగా ఆప్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పంజాబ్లో వారి సొంత ప్రభుత్వానికే పెద్ద ఇబ్బందిగా పరిణమించాయి. ప్రతిపక్షాల దూకుడు పెంచిన తరుణంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు పంజాబ్ లో ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications