"మాట తప్పారు... రేపట్నుంచి మళ్లీ నిరసనలు..!"- కేంద్రానికి కాక్రోచ్ పార్టీ హెచ్చరిక..!
నీట్ అక్రమాలకు బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు నిరసనల్లో పాల్గొన్న విద్యార్దులపై ఎలాంటి కేసులు, నిర్బంధాలు, ఎఫ్ఐఆర్ లు ఉండవంటూ చర్చల సందర్బంగా కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం, విద్యార్ధుల్ని వదలకపోవడంపై సీజేపీ ఇవాళ తీవ్రంగా స్పందించింది.
విద్యార్ధుల్ని టార్గెట్ చేయటంపై ఆందోళన వ్యక్తం చేసిన సీజేపీ.. కేంద్రం వెనక్కి తగ్గకపోతే మళ్లీ ఉద్యమం చేపడతామని హెచ్చరించింది.
అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా విద్యార్థులు, ఇతర నిరసనకారులను లక్ష్యంగా చేసుకోవడం, నిర్బంధించడం లేదా అరెస్టు చేయడం వంటి నివేదికలు అందుతున్నాయని, దీనిపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ లేదా ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఏ నిరసనకారుడిపైనా ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ ఎటువంటి శిక్షాత్మక చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన తర్వాతే దేశవ్యాప్త నిరసనను విరమించామని, కాబట్టి తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

ముందుగా నిర్బంధించబడిన వారిని విడుదల చేయడానికి, సాధ్యమైనంత చట్టపరమైన సహాయాన్ని అందించడానికి, సంబంధిత రాష్ట్రాల్లోని సమర్థులైన న్యాయవాదులతో తమ న్యాయ బృందం ఇప్పటికే సమన్వయం చేసుకుంటోందని, ప్రతి నిరసనకారుడికి తాము హామీ ఇవ్వాలనుకుంటున్నామని సౌరవ్ దాస్ తెలిపారు. ఇది మొదటి రోజు నుండే జరుగుతోందన్నారు. అలాగే నిర్బంధించిన వారిని విడుదల చేయడం ద్వారా, దేశంలో ఎక్కడా ఏ నిరసనకారుడిపైనా బలవంతపు లేదా ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఆదేశించడం ద్వారా తమకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని, మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ను కోరారు. ముఖ్యంగా విద్యార్దులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కూడా ఉపసంహరించుకోవాలన్నారు.
🚨STATEMENT
— Saurav Das (@SauravDassss) July 27, 2026
We are deeply concerned by multiple reports reaching us of students and other protestors being targeted, detained, or arrested by various state agencies, particularly in Assam, West Bengal, and Bihar.
The Cockroach Janta Party had called off its nationwide protest…
ఈ విషయంలో రేపటి కల్లా (మంగళవారం) లిఖితపూర్వక హామీని ఇస్తామన్న తమ నిబద్ధతను కూడా కేంద్రానికి గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్త నిరసనను నిలిపివేయాలన్న తమ నిర్ణయం సద్భావనతో, ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటుందన్న హామీ ఆధారంగా మాత్రమే తీసుకున్నట్లు తెలిపారు. ఆ హామీ నుండి వైదొలగడం అనేది 'కాక్రోచ్ జనతా పార్టీ'తో విశ్వాస ఉల్లంఘన మాత్రమే కాదు, నిరసనల కంటే చర్చలకే ప్రాధాన్యత ఇచ్చిన లక్షలాది మంది భారతీయ యువత పట్ల ఉన్న ప్రజా విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడమే అవుతుందన్నారు. అటువంటి విశ్వాస ఉల్లంఘన యువతకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కేవలం వాగ్దానం చేయడం వల్ల కాకుండా, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం వల్లే విశ్వసనీయత లభిస్తుందని కేంద్రానికి గుర్తుచేసారు.

అలాగే యువ నిరసనకారులతో తాము చెప్పేది ఒక్కటేనని, ధైర్యంగా ఉండండి, మేము మీకు అండగా ఉన్నాముని తెలిపారు. సీజేపీ పరిస్థితిని నిశితంగా గమనిస్తూనే ఉంటుందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భారత ప్రభుత్వం, అన్ని బీజేపీ/ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత అత్యవసరంగా, బాధ్యతాయుతంగా, సద్భావనతో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. నిర్బంధించిన లేదా అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని, అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము తదుపరి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.














Click it and Unblock the Notifications