వెబ్పోర్టల్ యాడ్: రూ. 2వేలకే అమ్మకానికి యువతి

వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 26న కొందరు వ్యక్తులు ఓ యువతి ఫొటోను ఆ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసి ఆమె ధరను 2వేల రూపాయలుగా నిర్ణయించారు. అంతేగాక వివరాల కోసం సంప్రదించాల్సిన వ్యక్తి పేరును, టెలిఫోన్ నెంబర్ను కూడా అందులో పెట్టారు. 22ఏళ్ల కోల్కతా యువతి అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తన పేరు సౌమన్ బరూయి అని, ఆ యువతికి తను ఏజెంట్నని ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. మీరు ఆ అమ్మాయితో ఆనందించాలనుకుంటే తనను సంప్రదించాలని కోరారు.
ఆ ప్రకటనలో తెలిపిన నెంబర్లో బరూయిని సంప్రదించగా.. ఇది తప్పుడు నెంబర్ అని చెప్పారు. తనకు ఏజెంట్ కావాలన్న ఆసక్తి కూడా లేదని చెప్పారు. ఆదివారం నుంచి తనకు అనేక కాల్స్ వస్తున్నాయని బరూయి చెప్పారు. తనను ఒక అమ్మాయి కోసం ఫోన్ చేసి అడుగుతున్నారని తెలిపారు. ఇదంతా గమనించిన తర్వాత ఇంటర్నెట్లో తన పేరుపై ఇలాంటి సమాచారం ఉంచినట్లు తెలుసుకున్నానని చెప్పారు.
తనకు బాధ కలిగించే ఇలాంటి పనులు ఎవరూ చేస్తున్నారనేది తనకు తెలియడం లేదని బరూయి అన్నారు. కాంఛ్రాపురలోని బిజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఈ పరిణామంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలా చేయకపోతే తను న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాడినని బరూయి చెప్పారు. తను బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశానని, త్వరలోనే తనపై సమాచారం ఉంచిన వారిని పోలీసులు పట్టుకుంటారని బరూయి పేర్కొన్నారు.
కాగా ఓఎల్ఎక్స్ ఇండియా మేనేజర్ అమర్జిత్ బత్రాను మీడియా సంప్రదించగా.. తనకు కూడా ఈ విషయం గురించి తెలియదని చెప్పి, పోర్టల్లో సమాచారం చూసిన అనంతరం వాస్తవమేనని చెప్పారు. ప్రముఖమైన పోర్టల్ కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, తమకు వచ్చిన ప్రతీ సమాచారాన్ని ఫిల్టర్ చేస్తామని ఆయన తెలిపారు.
ఆ సమాచారాన్ని వెంటనే తమ పోర్టల్ నుంచి తొలగిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన పావుగంటలోనే ఆ ప్రకటనను పోర్టల్ నిర్వాహకులు తొలగించారు. ఎలాంటి వివరాలు తెలియజేయకుండానే తమ ప్రకటనలను అప్లోడ్ చేసుకునే అవకాశం ఉండడంతో కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications