అరెరె.. సాక్షాత్తు మంత్రి.. చీపురు పట్టాడు.. ఆఫీసు ఊడ్చేశాడు
ఉత్తరప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారీ ఏకంగా చీపురు చేత పట్టి తన కార్యాలయాన్ని తానే శుభ్రం చేసుకున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రే కాదు.. ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా వెరైటీ పనులతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఉపేంద్ర తివారీ అనే మంత్రి ఏకంగా చీపురు చేత పట్టి తన కార్యాలయాన్ని తానే శుభ్రం చేసుకున్నారు.
గత సోమవారమే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ సభ్యులతో ఓ ప్రమాణం కూడా చేయించారు. తమ పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, ఏడాదిలో కనీసం వంద గంటలు దీనికోసం కేటాయించాలని మంత్రులందరికీ సూచించారు.
దీని ప్రభావమో ఏమోగానీ, మంత్రి ఉపేంద్ర తివారీ తన కార్యాలయం అపరిశుభ్రంగా ఉండడం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో వదిలేయకుండా స్వయంగా చీపురుపట్టి తన కార్యాలయంతోపాటు బయట కారిడార్ కూడా ఊడ్చిపడేశారు.
ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరూ గుట్కా, పాన్ మసాలాలు తినకూడదని సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి తివారీ చీపురు చేతబట్టగానే అధికారులు ముందు అవాక్కయ్యారు.. ఆపైన ఆయన చేసిన పని చూసి నోరెళ్లబెట్టారు.