ఫోర్త్ వేవ్ టెన్షన్ - ఒక్కరోజే 12,213 కరోనా కేసులు : పెరుగుతున్న మరణాలు..!!
మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరి తరువాత భారీగా కేసులు ఈ సంఖ్యలో నమోదవటం ఇదే ప్రధమం. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 12,213 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు రావటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎక్కువగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులోనే 2,293 కేసులు నమోదయ్యాయి.
బుధవారం 7,624 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతంగా నమోదైంది. డైలీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా రిజిస్టర్ అయింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులు: 43,257,730గా ఆరోగ్య శాఖ ప్రకటించారు. ఇప్పటి దాకా మొత్తం మరణాలు: 5,24,803గా నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 58,215గా ఉండగా.. ఇక, కోలుకున్నవారి సంఖ్య: 4,26,74,712గా నమోదయ్యాయి. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,67,37,014 కోట్లు. బుధవారం నాడు 15,21,942 మందికి టీకాలు అందించారు. 5,19,419మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
Recommended Video
ఈ డిసెంబర్ వరకు కరోనా వ్యాప్తి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తీవ్రత మాత్రం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరగటంతో మరోసారి ఫోర్త్ వేవ్ అలజడి మొదలైందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచదేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 601,129 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,368 మరణాలు నమోదయ్యాయి.అమెరికాలో 99,100 కేసులు వెలుగుచూశాయి. మరో 305 మందికిపైగా చనిపోయారు. పెరుగుతున్న కేసులు..ఇదే సమయంలో వేసవి సెలవుల తరువాత పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.