కోటి రూపాయల కారులో యడ్యూరప్ప ప్రచారం!
బెంగళూరు: ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన చేతికి పెట్టుకున్న రూ. 70లక్షల వాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప వంతు వచ్చినట్లుంది.
ఇటీవలే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షడిగా పగ్గాలు చేపట్టిన మాజీ సీఎం యడ్యూరప్ప తాను కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన టయోటా ప్రడో కారులోనే పర్యటించనున్నారు. పలు అత్యాధునిక సదుపాయాలు కల్గిన ఈ కారునే తన ప్రచార రథంగా మలచుకుంటున్నారు.
దాదాపు కోటి రూపాయలు (రూ. 92.35 లక్షలు) ఖరీదైన ఈ కారును ఇటీవల యడ్యూరప్ప కొనుగోలు చేశారు. కారు ఆయన ఇంటికి చేరేటప్పటికి రూ.కోటికి పైగా ధర పలికింది.
కొత్తకారుపై బీజేపీ అధ్యక్షుడు అనే నేమ్ ప్లేట్ పెట్టించారు. కాగా, కారుకు శుక్రవారం పూజలు చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ జోషి పాతమోడల్ పార్టీ కారునే వాడేవారు. యడ్యూరప్ప ఇప్పుడు కొత్తరథంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.
కాగా, బిజెపి అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్త, రాజకీయ నేత మురుగేష్ నిరానీ నుంచి సదరు కారును యడ్యూరప్ప అరువుగా తీసుకున్నారని చెప్పారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పెట్టుకున్న రూ. 70లక్షల వాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా, బిజెపి అధ్యక్షుడిగా యడ్యూరప్పను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసన తెలిపారు.