శశికళ చెప్తే జైల్లో ఉన్నట్లు సీక్రెట్గా..: ఖుష్బూ, 'ఎమ్మెల్యేలు సేఫ్'
ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానమిస్తూ... ఎమ్మెల్యేలంతా వారి వసతి గృహాల్లో ఉన్నారని సమాధానం చెప్పారు.
చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పార్టీ అధినేత్రి శశికళ వర్గీయులు రహస్య ప్రాంతాలకు తరలించడం దుమారం రేపుతోంది. వివిధ రిసార్టులలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వైపు వచ్చారు. మరికొందరు కూడా గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఆ విషయాలను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడుకు చెందిన ప్రముఖ న్యాయవాది బాలు, రామస్వామిలు మద్రాసు హైకోర్టులో ఈ విషయమై హెబియస్కార్పస్ దాఖలు చేశారు. దానికి ప్రభుత్వ తరపు న్యాయవాది సమాధానమిస్తూ... ఎమ్మెల్యేలంతా వారి వసతి గృహాల్లో ఉన్నారని సమాధానం చెప్పారు.
స్టార్ హోటల్లో ఉంచుతారా..
దీనిపై ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా స్పందించారు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలంతా ఎక్కడున్నారో చెప్పాలని, వారిని స్టార్ హోటల్లో ఉంచటం ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని, గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.
శశికళ చెబితే జైల్లో ఉన్నట్లు సీక్రెట్గా..
'ఏసీ బస్సుల్లో రహస్య ప్రదేశాలకు వెళ్లిన ఎమ్మెల్యేలకు అసలు ఆత్మగౌరవం ఉందా? నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఎమ్మెల్యేలు డబ్బుకు ఆశపడి, అధికారానికి ఆశపడి ఆమె (శశికళ) చెప్పినట్లుగా జైలులో ఉన్నట్లుగా రహస్య ప్రదేశాలకు వెళ్లారా?' అని కాంగ్రెస్ నేత, సినీనటి ఖుష్బూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.
లోకసభలో ఆందోళన
మరోవైపు, తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలు ఈరోజు లోకసభలో ఆందోళన చేశారు. శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి మద్దతిస్తూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి వెళ్లి నినాదాలు చెయ్యడంతో సభకు అంతరాయం కలిగింది.
గవర్నర్ పరిధిలోని అంశం
అంతకుముందే లోకసభలో అన్నాడీఎంకే పార్టీ నేత పి వేణుగోపాల్ తమిళనాడు అంశంపై చర్చకు అనుమతించాలని స్పీకర్ సుమిత్రామహాజన్ను కోరగా ఆమె అందుకు నిరాకరించారు. ఎంపీలు ఆందోళన చేస్తుండడంతో ఈ విషయాన్ని జీరో అవర్లో లేవనెత్తాలని చెప్పి సభను 20 నిమిషాలు వాయిదా వేశారు. ఇది గవర్నర్కు సంబంధించిన అంశమని, సభలో లేవనెత్తవొద్దని సూచించారు.
మాకు సంబంధం లేదు
ఇదిలా ఉండగా, తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పందించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు అధికార అన్నాడీఎంకే అంతర్గత విషయం అని చెప్పారు. అక్కడి రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టంచేశారు.