మహారాష్ట్రలో ఇక నెంబర్ గేమ్ షురూ :అనర్హత వేటు తప్పించుకోవాలంటే: ప్రభుత్వం నిలిచేనా..!
మహారాష్ట్రలో అసలు రాజకీయం మొదలైంది. బీజేపీకి మద్దతిచ్చి..తన పార్టీల పరంగా హామీ ఇచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పైన పార్టీ అధినేత చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను ఎన్సీపీ లెజిస్టేచరీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా తప్పించారు. ఆయన తో పాటుగా ఎవరైనా బీజేపీకి మద్దతిస్తే అనర్హత వేటు వేస్తామని శరద్ పవార్ ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీకి మద్దతిస్తే వారిపైన అనర్హత వేటు తప్పదని శరద్ పవార్ హెచ్చరించారు. అయితే, అజిత్ పవార్ తనతో సహా..మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు లేకుండా చూసుకోవాలంలే 18 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించాల్సి ఉంటుంది. ఇక, శివసేన.. ఎన్సీపీ అధినేత మీడియా సమావేశానికి కాంగ్రెస్ గైర్హాజరవ్వటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ సైతం ఈ మూడు పార్టీల అడుగులు నిశితంగా గమనిస్తోంది. ప్రభుత్వం నిలబెట్టకొనే విధంగా పావులు కదుపుతోంది. దీంతో..ఇప్పుడు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ మొదలైంది.
ఢిల్లీ నుంచి రాజ్భవన్ దాకా: మహారాష్ట్రలో ఏమి జరిగింది..మినిట్ టూ మినిట్ అపడేట్స్
నెంబర్ గేమ్ మొదలైంది..
ముఖ్యమంత్రిగా అనూహ్య పరిస్థితుల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడుతుందా..తడబడుతుందా అనేది ఇప్పుడు చర్చ. ఫడ్నవీస్ కు గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకు బలం నిరూపించుకోవటానికి సమయం ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం 30న కుప్ప కూలుతుందని శివసేన..ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తమకు మద్దతుగా ఎన్సీపీ ..శివసేన నుండి వచ్చే వారి కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నా..అదే విధంగా ప్రభుత్వం పడగొట్టాలన్నా మహారాష్ట్రలో నాలుగు ప్రధాన పార్టీలు ఇప్పుడు నెంబర్ గేమ్ మొదలు పెడుతున్నాయి. అదే సమయంలో అనర్హత అంశం మీద అప్పుడే చర్చ మొదలైంది.
మద్దతిచ్చే ఎమ్మెల్యేలపై అనర్హత అంటూ..
తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత కీలక వ్యాఖ్యలు చేసారు. అజిత్ పవార్ తో రాజ్ భవన్ కు పది మంది ఎమ్మెల్యేలు వెళ్లారని..అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేసారని వివరించారు. ఇక, మిగిలిన ఎమ్మెల్యేలంతా తిరిగి ఎన్సీపీతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఎవరైనా బీజేపీకి మద్దతిస్తే వారిపైన అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. అజిత్ పవార్ ను పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుండి తొలిగించారు. అయితే, అదే సమయంలో బలపరీక్ష కోసం సభ సమావేశమైన సమయంలో అనేక సాంకేతిక అంశాలు తెర మీదకు వస్తాయి. ఆ సమయంలో సమయానికి అనుకూలంగా తీసుకొనే నిర్ణయాలు కీలకం కానున్నాయి.
అజిత్ కు 18 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం
శరద్ పవార్ హెచ్చరిస్తున్నట్లుగా అనర్హత వేటు నుండి తప్పించుకోవాలంటే అజిత్ పవార్ కు ఎన్సీపీ నుండి 18 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్సీపీకి మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అందులో మూడో వంతు ఎమ్మెల్యేల మద్దతు చీలిక వర్గ నేత అజిత్ కు అవసరం. అయితే, అజిత్ వెనుక 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, సీఎంగా ఫడ్నవీస్ కొనసాగాలంటే సభలో 145 మంది మద్దతు అవసరం. అందులో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, అజిత్ పవార్ తో ఎంత మంది వస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు ఇస్తున్న లీకులు కొత్త చర్చకు కారణంగా మారుతున్నాయి.
కీలకం కానున్న స్పీకర్ నిర్ణయం
ఇక..బల పరీక్ష్ సమయంలో సభలో నెంబర్ గేమ్ చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆ సమయంలో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. ఇప్పుడు సాధారణంగా బీజేపీ నుండే స్పీకర్ ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సభలో హాజరు అయిన సభ్యుల్లో యాభై శాతం కంటే ఎక్కువగా ఒక్క ఓటు వచ్చినా బల పరీక్షలో నెగ్గినట్లే. అయితే, అన్ని పార్టీలు విప్ లు జారీ చేయటం పరిపాటి. ఎన్సీపీ అధినేత తమ ఎమ్మెల్యేల మీద భరోసాతో ఉన్నా..ఈ వారం రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఇక...బల పరీక్ష సమాయానికి ఎన్సీపీ..శివసేన నుండి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే ఇప్పుడు బీజేపీ ధీమాకు కారణంగా ఉంది. దీంతో..స్పీకర్ తీసుకొనే నిర్ణయాలు ఫైనల్ కానున్నాయి. ఇదే సమయంలో స్వతంత్ర అభ్యర్ధుల పాత్ర కీలకం కానుంది.