రాజీనామా చేయను: అఖిలేష్, 36 మందిపై వేటు
లక్నో: లోకసభ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సహాయ మంత్రి హోదా గల 36 మంది నేతలపై వేటు వేశారు. తాను మాత్రం రాజీనామా చేయడానికి నిరాకరించారు. వేటు పడినవారిలో ఆరుగురు మైనారిటీ వర్గానికి చెందినవారున్నట్లు సమాచారం.
అఖిలేష్ రాజీనామా చేస్తారని వస్తున్న వదంతుల నేపథ్యంలో తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. లోకసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాజకీయ సమీకరణాలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయని, ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చలేమని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎస్పీ తగిన ఫలితాలు సాధించకపోవడంపై సమీక్ష జరుపుతామని చెప్పారు.
వేటు పడినవారిలో నరేంద్ర భటి, సురేంద్ర మోహన్ అగర్వాల్ ఉన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన అనిస్ మన్సోరి, మొహ్మద్ అబ్బాస్, ఇక్బాల్ అలీ, హజీ ఇఖ్రామ్, కమ్రుద్దీన్ ఉన్నారు. మాజీ విద్యార్థి నాయకులు రాజ చతుర్వేది, రామ్ సింగ్ రాణాలపై కూడా వేటు పడింది.
ఉత్తరప్రదేశ్లోని 80 లోకసభ స్థానాల్లో పాలక ఎస్పీ కేవలం ఐదు సీట్లు గెలుచుకుంది. ఐదు సీట్లలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ రెండు సీట్లను గెలుచుకున్నారు. ములాయం కోడలు డింపుల్ యాదవ్ విజయం సాధించారు.