షాకింగ్: ఒకే వ్యక్తికి తొలి డోసు కోవాగ్జిన్.. రెండో డోసు కోవిషీల్డ్, అస్వస్థతకు గురైన 72ఏళ్ల వ్యక్తి, విచారణ
ముంబై: మహారాష్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ 72 ఏళ్ల తొలిసారి ఇచ్చిన డోసు కాకుండా రెండో డోసు వేరే వ్యాక్సిన్ డోసు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరిగిందని, డోసు తీసుకున్న వ్యక్తికి ఏం జరుగుతుందోనని ఇప్పుడు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక వ్యక్తికి తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకుంటాడో.. అతనికి రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ది ఇవ్వాల్సి ఉంటుందనేది తెలిసిన విషయమే.
తొలి డోసు కోవాగ్జిన్.. రెండో డోసు కోవిషీల్డ్..
మహారాష్ట్ర జల్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దత్తాత్రేయ వాఘ్మేర్ అనే వ్యక్తి మార్చి 22న స్థానిక ఆస్పత్రిలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఏప్రిల్ 30న రెండో వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. అయితే, రెండో డోసు కూడా కోవాగ్జిన్ ఇవ్వాల్సి ఉండగా.. వైద్య సిబ్బంది ఆయనకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, కరోనా తొలి డోసు తీసుకున్న ఆస్పత్రి కాకుండా ఈయన మరో స్థానిక ఆస్పత్రిలో రెండో డోసుకున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నా తండ్రి అనారోగ్యం పాలయ్యారు: దిగంబర్
రెండో డోసు తీసుకున్న తర్వాత తన తండ్రికి జ్వరంతోపాటు శరీర భాగాల్లో ర్యాషెస్ వచ్చాయని దత్తాత్రేయ వాఘ్మేర్ కుమారుడు దిగంబర్ తెలిపారు. కొంత ఆందోళనకరంగా ఉన్నారని చెప్పారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తొలి డోసు తీసుకున్న వ్యాక్సిన్ కాకుండా మరో వ్యాక్సిన్ ఇచ్చారని మండిపడ్డారు. తన తండ్రి వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత చూస్తే రెండు వేర్వేరు డోసుల సర్టిఫికేట్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. తొలి డోసు కోవాగ్జిన్ ఇచ్చారని, రెండో డోసుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారని వాపోయారు.
విచారణకు ఆదేశం.. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేయకూడదు..
తన తండ్రి చదువుకోలేదని, తాను కూడా ఎక్కువగా చదువుకోలేదని దిగంబర్ తెలిపారు. తన తండ్రికి సరైన వ్యాక్సిన్ డోసు ఇవ్వాల్సిన బాధ్యత ఆస్పత్రిలోని వైద్య సిబ్బందిదేనని ఆయన స్పష్టం చేశారు. కానీ, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి తన తండ్రిని అనారోగ్యంపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ పరిణామాలపై విచారణ జరుపుతున్నారు అధికారులు. కాగా, కరోనా వ్యాక్సిన్ డోసులను మిక్స్ చేయడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. అలసట, తలనొప్పితో కొంత అనారోగ్యానికి గురవుతారని ఇటీవల విడుదలైన కొన్ని అధ్యయానాలు తేల్చాయి. కాగా, ఇప్పటి వరకు ఇలా వేర్వేరు వ్యాక్సిన్ డోసులు ఇచ్చిన ఘటన ఇదే తొలిది కావడం గమనార్హం.
Recommended Video