నిర్భయ కేసు: నిందితుడు ముఖేష్ సింగ్ వేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 2012 నిర్భయ ఘటన నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా క్యూరేటివ్ పిటిషన్ వేసుకునేందుకు అనుమతించాలంటూ ముఖేష్ సింగ్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఉరిశిక్ష అమలును ఎలాగైనా ఆపించివేయాలన్న నిందితుడి కుట్రకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
ఇప్పటికే అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని సుప్రీంకోర్టు నిందితుడు ముఖేష్ తరపున లాయరుతో చెప్పింది. క్షమాభిక్ష పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ ఇలాంటివన్నీ తిరస్కరించబడ్డాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక ఏమీ మిగల్లేదంటూ ఘాటుగా చెప్పింది. ఇప్పటికే కోర్టుల నుంచి వెలువడిన ఆదేశాలు, క్షమాభిక్ష పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ లాంటివన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే రానున్న శుక్రవారం నిర్భయ ఘటన నిందితులకు ఉదయం 5:30 గంటలకు ఉరి తీయనున్నారు.
క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వద్ద నిందితుడు పవన్ గుప్తా దాఖలు చేసుకున్న పిటిషన్ తిరస్కరించబడ్డాక మరోమారు ఉరిశిక్ష తేదీని కోర్టు ఖరారు చేసింది. మార్చి 20వ తేదీన నిర్భయ ఘటన నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ అడిషనల్ సెషన్స్ జడ్జ్ ధర్మేంద్ర రానా తీర్పు చెప్పారు. ఇప్పటికే నిందితులు అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ఇక తీహార్ జైలులో నిర్భయ ఘటన నిందితులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్లను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉరితీసే తలారి పవన్ జలాల్ను రేపు ఢిల్లీకి రావాల్సిందిగా తీహార్ జైలు అధికారులు కబురు పెట్టారు. రేపు డమ్మీ ఉరి ఉంటుందని తీహార్ జైలు అధికారులు చెప్పారు. 2012 డిసెంబర్ 16న నిర్భయపై కదిలే బస్సులో అత్యంత పాశవికంగా నిందితులు అత్యాచారం చేశారు. చిత్రహింసలకు గురిచేశారు. అయితే తీవ్రంగా గాయపడిన నిర్భయ సింగపూర్లో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. నిందితుల్లో ఒకడు మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడేళ్లు గడిపిన తర్వాత విడుదలయ్యాడు. మరోవైపు రాంసింగ్ అనే ప్రధాన నిందితుడు జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.