భార్యలకు హైకోర్టు గుడ్ న్యూస్: భరణం హక్కుపై కీలక ఉత్తర్వులు!
భార్య పోషణకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఓ కీలక తీర్పును వెలువరించింది. భర్త ఆదాయంలో 25 శాతం వరకు భార్యకు భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన భార్యకు పెంచిన భరణాన్ని సవాలు చేస్తూ ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
కేసు నేపథ్యం ఇదే..
సురేష్ చంద్ర అనే వ్యక్తి తన భార్యకు భరణం చెల్లించాలని గతంలో కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. మొదట్లో నెలకు రూ.500 గా ఉన్న ఈ మొత్తాన్ని షాజహాన్పూర్ ఫ్యామిలీ కోర్టు రూ. 3,000కు పెంచింది. ఈ పెంపును సవాలు చేస్తూ సురేష్ చంద్ర అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఒక సామాన్య కూలీనని, ఇంత మొత్తాన్ని చెల్లించడం తన వల్ల కాదని ఆయన వాదించారు. జస్టిస్ మదన్ పాల్ సింగ్ ఈ పిటిషన్ను విచారిస్తూ భర్త బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యను ఆదుకోవడం భర్త పవిత్రమైన, చట్టపరమైన బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. భర్తకు ఎటువంటి శారీరక వైకల్యం లేనప్పుడు, అతను ఆరోగ్యవంతుడని.. కష్టపడి పని చేసి భార్యను పోషించాల్సిన బాధ్యత నుండి తప్పించుకోలేడని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గత తీర్పులను పేర్కొంటూ.. ఓ వ్యక్తి కూలీ అని చెప్పుకున్నా, ప్రస్తుత కాలంలో రోజుకు రూ. 600 సంపాదించగలడని, అంటే నెలకు రూ. 18,000 ఆదాయం ఉంటుందని కోర్టు లెక్కగట్టింది.
25 శాతం నిబంధన
భర్త ఆదాయంలో 25 శాతాన్ని భార్యకు భరణంగా ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయని అలహాబాద్ హైకోర్టు గుర్తు చేసింది. భర్త నెలకు రూ. 18,000 సంపాదిస్తున్నాడని భావిస్తే, అందులో 25 శాతం అంటే రూ. 4,500 వరకు ఇవ్వవచ్చు. కానీ ఫ్యామిలీ కోర్టు కేవలం రూ. 3,000 మాత్రమే ఇవ్వాలని ఆదేశించిందని, ప్రస్తుత ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం ఎక్కువ కాదని కోర్టు అభిప్రాయపడింది. చివరికి భర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, భార్యకు నెలకు రూ. 3,000 భరణం చెల్లించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.












Click it and Unblock the Notifications