జస్టిస్ ఎన్వీ రమణతో అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి భేటీ.. తీర్పుపై థాంక్స్
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి చివరి రోజు సీజేఐ ఎన్వీ రమణ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిని మంత్రి కేటీఆర్, నేతలు.. జర్నలిస్ట్ సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు స్వాగతించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జర్నలిస్ట్ సంఘాల నేతలు ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా మీట్ అయ్యారు.
జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో రెండు రోజుల క్రితం సానుకూల తీర్పును ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అల్లం నారాయణతోపాటు జర్నలిస్టు సంఘాల నేతలతో జస్టిస్ ఎన్వీ రమణ పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 'కొలిమి అంటుకున్నది' అనే పుస్తకం గురించి ప్రస్తావించారు. జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, ఢిల్లీ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ ముగిసే చివరి రోజు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 వేల మంది జర్నలిస్టులను ఉద్దేశించిన హౌసింగ్ సొసైటీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ అంశంపై జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదని పేర్కొన్నారు. ఈ తీర్పుతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో జస్టిస్ ఎన్వీ రమణను అల్లం నారాయణ, క్రాంతి కలుసుకుని.. థాంక్స్ చెప్పారు.