ముఖేష్ అంబానీ ప్రసంగం విలువెంతో తెలుసా!
ముంబై : టెలికాం రంగంలో రిలయన్స్ దూకుడుకు.. మిగతా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే జియో ప్లాన్ ద్వారా ఇతర టెలికాం రంగాలను రిలయన్స్ భారీ దెబ్బ కొట్టగా.. ముఖేష్ అంబానీ తాజా ప్రసంగంతో భారతి ఎయిర్ టెల్, ఐడియా నెట్ వర్క్ లాంటి సంస్థల మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
గురువారం నాడు 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వివిధ ప్యాకేజీల వివరాలను ప్రకటించిన ముఖేష్ అంబానీ దాదాపు 45 నిమిషాలపాటు ప్రసంగించారు. ఉచిత ఆఫర్స్ తో కస్టమర్లను ఆకట్టుకోవడానికి.. ఉచిత రోమింగ్, ఉచిత్ వాయిస్ కాల్స్, ఉచిత అపరిమిత మెసేజ్ లు.. ఇలా ఫ్రీ మంత్రాన్ని జపిస్తూ పోవడం.. మిగతా టెలికాం రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ముఖేష్ ప్రసంగంతో.. మొత్తం 13,800 కోట్ల నష్టాన్ని టెల్కో కంపెనీలు మూటగట్టుకున్నట్టుగా మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అతిపెద్ద మార్కెట్ గా విస్తరించిన భారతి ఎయిర్ టెల్ అత్యధికంగా 12వేల కోట్లు నష్టపోగా, రెండో అతిపెద్ద టెల్కో అయిన ఐడియా సెల్యూలర్ 2800కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. ఈ ప్రభావంతో ఏకంగా 52 వారాల కనిష్ట స్థితికి చేరుకున్న ఐడియా 9.09శాతం నష్టాన్ని మూటగట్టుకుంది.
గురువారం మధ్యాహ్నాం సమయానికి ఎయిర్ టెల్, ఐడియా రెండింటి మార్కెట్ 9శాతం వరకు పడిపోయింది. ఆ తర్వాత ఎయిర్ టెల్ కొద్దిగా నిలదొక్కుకోగలిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84.50 వద్ద, భారతీ ఎయిర్ టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310.75 దగ్గర ట్రేడ్ అయ్యాయి. దీంతో గురువారం నాడు అత్యధికంగా నష్టపోయిన మార్కెట్ కంపెనీల్లో ఎయిర్ టెల్, ఐడియా ప్రధానంగా నిలవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. రిలయన్స్ జియో మిగతా టెలికాం రంగాలకు గట్టి దెబ్బగా పరిణమించింది. జియో ప్లాన్ కు పది కోట్ల మంది రిలయన్స్ కస్టమర్లుగా మారుతారని ముఖేష్ ప్రకటించిన నేపథ్యంలో.. మిగతా కంపెనీల్లో ఆందోళన మొదలయింది. రిలయన్స్ తో పోటీని తట్టుకోవడం కోసం ఇప్పటికే ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి సంస్థలు నెట్ చార్జీలను తగ్గించినట్లుగా ప్రకటించాయి.
ఇదంతా ఒకెత్తయితే.. ఆఖరికి ఫ్రీ వాయిస్ ఆఫర్ ను కూడా రిలయన్స్ తీసుకురావడంతో.. మిగతా టెలికాం కంపెనీలకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఈ విషయంలో రిలయన్స్ ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే చెప్పాలి.