విద్యాసాగర్ రావు ఇప్పట్లో చైన్నై వచ్చే సూచనలు లేవా!?
ప్రస్తుతం ముంబైలోనే ఉన్న గవర్నర్ విద్యాసాగర్రావు ఈరోజు సాయంత్రం ఓ కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం కూడా ఆయన చెన్నై వెళ్లే సూచనలు లేనట్టు తెలుస్తోంది.
చెన్నై: శశికళ-పన్నీర్ సెల్వం మధ్య అనూహ్య మలుపులు తిరుగుతూ రాజకీయ సంక్షోభం దిశగా సాగుతోన్న అన్నాడీఎంకె రాజకీయాలు ఇంకా అదే రీతిలో కొనసాగుతున్నాయి. ఇరు వర్గాలు ఎత్తులకు పై ఎత్తులతో అధికారాన్ని నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా తనవైపే ఉన్నారని శశికళ చెబుతోండగా.. అన్నాడీఎంకె వర్గాలు సైతం సీఎంగా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు గవర్నర్ రాక కోసం వేచి చూస్తున్నాయి. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్రావు మాత్రం ఇప్పట్లో చెన్నై వెళ్లే సూచనలు లేకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ముంబైలోనే ఉన్న గవర్నర్ విద్యాసాగర్రావు ఈరోజు సాయంత్రం ఓ కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం కూడా ఆయన చెన్నై వెళ్లే సూచనలు లేనట్టు తెలుస్తోంది. ఈ లెక్కన శశికళ ప్రమాణ స్వీకారానికి మరిన్ని రోజులు వేచి చూడక తప్పని పరిస్థితి.
ఇదిలా ఉంటే, తమిళనాడు పరిణామాలపై గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోరినట్లు సమాచారం. కాగా, శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ గవర్నర్ విద్యాసాగర్రావు తీసుకున్న చర్యను మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ సమర్థించారు. గవర్నర్ నిర్ణయం సరైందేనన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తన విచక్షణాధికారాలను ఉపయోగించి ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసే అధికారం గవర్నర్ కు ఉందని గుర్తుచేశారు.