Amit Shah : యూపీ ఓటర్లకు అమిత్ షా సెల్యూట్-మోడీపై విశ్వాసం ఉంచినందుకు
ఉత్తర్ ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఈ పోరులో బీజేపీ సక్సెస్ అయినట్లయింది. దీనిపై బీజేపీ నేతలు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇవాళ బీజేపీ సాధించిన విజయాలన్నీ ఓ ఎత్తయితే యూపీలో సాధించిన విజయం మరో ఎత్తు. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి భారీ విజయం కట్టబెట్టిన ఓటర్లకు అమిత్ షా సెల్యూట్ చేశారు. బీజేపీకి మరోసారి ఓటు వేసినందుకు ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారంటూ ఓటర్లకు అమిత్ షా ధన్యవాదాలు చెప్పారు. 2014, 2017, 2019 తర్వాత ఇవాళ 2022లోనూ మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు యూపీ ఓటర్లకు సెల్యూట్ అంటూ అమిత్ షా ట్వీట్ లో పేర్కొన్నారు. తద్వారా మోడీపై తన విశ్వాసాన్ని కూడా ఆయన చాటుకున్నారు.
బీజేపీ యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం వెనుక ప్రధాన పాత్ర అమిత్ షా దే. యోగీ అధికారంలోకి రాగానే శాంతిభద్రతలపై దృష్టిపెట్టేలా చేయడంతో పాటు ప్రధాని మోడీని ఒప్పించి భారీగా నిధులు కేటాయించడం, మహిళలకు పథకాలు ప్రవేశపెట్టడం, చివరికి ఎన్నికల్లోనూ తనదైన వ్యూహరచనతో అమిత్ షా దోహదపడ్డారు. ముఖ్యంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా మారిన యూపీలో ఏమాత్రం పొరబాటు జరిగినా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి అమిత్ షా వేసిన అడుగులు యోగీని మరోసారి అధికార పీఠం ఎక్కించడంతో పాటు ప్రధాని మోడీని 2024లో మరోసారి పదవిలోకి తెచ్చేలా ఉన్నాయి.