2029 కల్లా 21 ఎన్డీయే రాష్ట్రాల్లో ..! చంద్రబాబుకు అమిత్ షా పెను సవాల్..!
దశాబ్దాలుగా బీజేపీ మ్యానిఫెస్టోలో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029 నాటికి ఉమ్మడి పౌరస్మృతిని (Uniform Civil Code) అమలు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే అసోం, ఉత్తరాఖండ్ వంటి పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమల్లోకి తెచ్చిన ఈ చట్టాన్ని ఇప్పుడు ఏపీ వంటి ఎన్డీయే మిత్రపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాలకు సంబంధించి ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్న ఉమ్మడి పౌరస్మృతిని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో 2029లోగా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ప్రకటించారు. తనకు ఆ నమ్మకం ఉందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటివి ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ వైఖరిని నెలకొల్పాయని ఆయన తెలిపారు. అన్ని రంగాలలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.

అమిత్ షా వ్యాఖ్యల్ని బట్టి చూస్తే బీజేపీ నేరుగా సీఎంలు కలిగి ఉన్న 17 రాష్ట్రాలతో పాటు మిత్రపక్షాలు సీఎంలుగా ఉన్న ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో సున్నితమైన ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సి ఉంది. మరో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ఉంది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తో పాటు ఎన్. రంగస్వామి సీఎంగా ఉన్న పుదుచ్చేరిలో ఉమ్మడి పౌరస్మృతి అమలు సవాలుగా మారే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం ఏపీలో జగన్ వైపు ఉన్న ముస్లింల ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఉమ్మడి పౌరస్మృతి అమలు సవాల్ విసురుతుందనే అంచనాలున్నాయి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా విపక్షంలో ఉన్న జగన్ కు ఇది ప్లస్ కానుంది.














Click it and Unblock the Notifications
