అవిశ్వాసం విపక్షాలకే-ప్రజలకు కాదన్న అమిత్ షా-ఇండియా కూటమిపై విమర్శలు..
మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం కోరుతూ కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ లోక్సభలో ప్రసంగం చేశారు. ప్రధాని మోడీ అవినీతిని, కుటుంబపాలనను, తాయిలాల రాజకీయాల్ని పారద్రోలాలని అంటుంటే విపక్షాలు మాత్రం క్విట్ ఇండియా అంటున్నాయని అమిత్ షా విమర్శించారు.
ప్రజలకు, లోక్ సభకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందని, కేవలం విపక్షాలకే ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు.
రోజుకు 17 గంటలు పనికి అంకితం చేయడం, గత తొమ్మిదేళ్లలో 50 కంటే ఎక్కువ మైలురాయి లాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని మోడీని అమిత్ షా ప్రశంసించారు. దేశ పురోగతి వైపు వెళ్తున్న ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారని షా ఆరోపించారు. నరేంద్ర మోదీ అవినీతి, రాజవంశ రాజకీయాలు, బుజ్జగింపులను కూల్చివేసి, పనితీరు రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

ఈ అవిశ్వాస తీర్మానం దేశంలోని ప్రతిపక్షాల నిజస్వరూపాన్ని బయటపెడుతుందని అమిత్ షా తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవినీతికి పాల్పడటం యూపీఏ గత చరిత్ర అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలను అమిత్ షా ప్రస్తావించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని యూపీఏ చెబుతూనే ఉందని, కేవలం రుణాలు మాఫీ చేయడంపైనే మాకు నమ్మకం లేదు కానీ రుణం తీసుకోనవసరం లేని వ్యవస్థను రూపొందించడంలో తమకు విశ్వాసం ఉందన్నారు.
మీరు పథకాలను తయారు చేశారు కానీ వాటిని అమలు చేయరని విపక్ష ఇండియా కూటమిపై అమిత్ షా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు మీరు జీఎస్టీని తొలగించారని, డీబీటీని అమలు చేశారని, పేదరికాన్ని తగ్గించారని మాపై ఆరోపణలు చేయొచ్చని, కానీ వీటన్నింటిని తాము సాధించామన్నారు. మీరు అన్నీ చెప్పారని, కానీ తాము చేసి చూపించామని విపక్షాలకు అమిత్ షా చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications