సడన్ సర్ప్రైజ్: ఏపీకి అమిత్ షా రాక -నల్లమల అడవుల్లోని శ్రీశైలం ఆలయానికి -2స్టేట్స్ అలర్ట్
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత రెండో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరుపొందిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంకొద్ది గంటల్లో తెలుగు గడ్డపై అడుగుపెట్టనున్నారు. సడన్ సర్ప్రైజ్ లాగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర హోం మంత్రి రాబోతున్న విషయం ఆఖరి గంటల్లో వెల్లడికావడం గమనార్హం. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండిన నల్లమల అడవులకు అమిత్ షా వెళ్లనున్నారు. అక్కడి..
ప్రఖ్యాత శ్రీశైలం ఆలయంలో అమిత్ షా పూజలు చేయనున్నారు. కేంద్ర హోం శాఖ, బీజేపీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం అమిత్ షా గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం ఆలయానికి రానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఉదయం 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా అనంతరం ఇక్కడికి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు.

మధ్యాహ్నం 12.25కు కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 వరకు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు..
లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటిరోజే అమిత్ షా శ్రీశైలం వస్తుండటం గమనార్హం. జాతకం, రాశుల పరంగానూ ఆగస్టు 12కు ఏదైనా ప్రత్యేకత ఉందా అనే కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. కాగా, నల్లమల అటవీప్రాంతం కావడంతో అమిత్ షా రాక సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి రాక సందర్భంగా అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ అంతర్గతంగా అలర్ట్ కొనసాగుతుండొచ్చు. కాగా,
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైపీపీ, సీఎం జగన్ పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండటం, క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్ బెయిల్ రద్దయి జైలుకు పోవడం ఖాయమని జోస్యాలు చెబుతుండటం, మరోవైపు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం అమిత్ షాను 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు కలుసుకున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి ఆంధ్రా పర్యటనలో ఆయనను ఎవరెవరు కలుస్తారు? అనేది కీలకంగా మారింది.
అమిత్ షాతో పాటుగా శ్రీశైలం ఆలయానికి ఆయన కుటుంబీకులు కూడా వస్తున్న నేపథ్యంలో హోం మంత్రి పర్యటనలో రాజకీయ కలయికలు ఉంటాయా లేదా అనేది ఉత్కంఠ రేపుతున్నది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు శ్రీశైలంలో షాను కలవొచ్చని తెలుస్తోంది. ఇటు అధికార వైసీపీ సైతం హోం మంత్రి మర్యాదలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా వీలైతే కీలక నేతలను పంపే అవకాశాలు లేకపోలేవు.












Click it and Unblock the Notifications