పహల్గామ్ వెళ్లిన అమిత్ షా- కాల్పులు జరిగిన చోట..
Pahalgam Terror Attack: పహల్గామ్లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు.
అదే సమయంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా బంద్ సైతం కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ షాపులు, వ్యాపార సంస్థలను మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆందోళనకారులు టైర్లను కాల్చి రోడ్ల మీద పడేసిన సంఘటనలు ఉన్నాయి.

అటు బారాముల్లా సమీపంలోని యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. పహల్గామ్లో అడుగు పెట్టారు. కాల్పులు చోటు చేసుకున్న బైసారన్ మీడోస్లో అడుగుపెట్టారు. ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీనగర్ నుంచి బయలుదేరిన ఆయన పహల్గామ్కు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో అక్కడి భద్రత వ్యవస్థను పరిశీలించారు.

గట్టి భద్రత మధ్య అమిత్ షా పర్యటన సాగింది. ప్రస్తుతం పహల్గామ్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ కార్యకలాపాలపై ఆరా తీశారు. కాల్పులు జరిగినప్పుడు బైసారాన్ మీడోస్లో ఎంతమంది పర్యాటకులు ఉన్నారు?, ఏకే 47తో ఉగ్రవాదులు ఆ ప్రదేశానికి ఎలా రాగలిగారు?, భద్రత లోపాలు ఏవైనా ఉన్నాయా వంటి అంశాలు సమీక్షించారు.
పహల్గామ్కు వెళ్లే ముందు అమిత్ షా శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద బాధితులను కలుసుకున్నారు. మృతుల నివాళి అర్పించారు. వారి కుటుంబీకుతో సమావేశం అయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం దృఢ సంకల్పంతో ఉందని అన్నారు. ఉగ్రవాదానికి భారత్ తలవంచబోదని చెప్పారు.












Click it and Unblock the Notifications