అక్రమ వలసదారులు ఔట్.. దేశమంతటా NRC అమలు.. అమిత్షా కీలక వ్యాఖ్యలు..!
ఢిల్లీ : జాతీయ పౌర రిజిస్టర్ను దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి National Register of Citizens (NRC) ని అమల్లోకి తెచ్చి అక్రమ వలసదారులకు చెక్ పెడతామని హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారత్కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డ అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు తెలిపారు. త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 బ్యాన్ బిల్లులు పార్లమెంటుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జాతీయ పౌర రిజిస్టర్ పక్కాగా అమలు.. కేంద్ర ప్రభుత్వం రెడీ
జాతీయ పౌర రిజిస్టర్ (National Register of Citizens - NRC) అమలుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక తయారు చేస్తోంది. ఆ మేరకు దేశమంతటా ఎన్ఆర్సీ అమలు చేస్తామంటూ ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి చెప్పుకొస్తున్నారు. అసోంలో మొదలైన ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటిస్తున్నారు. అదే క్రమంలో మరోసారి జాతీయ పౌర రిజిస్టర్పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయింది. భారత్లోకి అక్రమంగా చొరబడి స్థిర నివాసం ఏర్పరచుకున్న విదేశీయులను వారి సొంత దేశాలకు పంపడమే లక్ష్యంగా ఎన్ఆర్సీ కీలకం కానుంది.

రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు
ఎన్ఆర్సీ అమలును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ఆ మధ్య అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సైతం ఎన్ఆర్సీ ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటూ మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. మరోవైపు ఎన్ఆర్సీ అమలుపై దేశంలోనే కాదు.. దేశం వెలుపల కూడా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై నిరసనలు పెరుగుతున్నాయి. అయితే వలసలు నిరోధించే క్రమంలో.. అసలైన భారతీయులను గుర్తించడానికి వీలుగా మాత్రమే ఎన్ఆర్సీ అమలు చేస్తామనేది బీజేపీ పెద్దల వెర్షన్.

అసోంలో అలా జరిగింది.. లోపాలు బయటపడి..!
అసోంలో జాతీయ పౌర రిజిస్టర్ అమలు సందర్భంగా లోపాలు బయటపడ్డాయి. దాదాపు 19 లక్షల మంది భారతీయులు కాదనే విషయం తేటతెల్లమైంది. అంతవరకు బాగానే ఉన్నా.. కొంతమంది భారతీయుల పేర్లు అందులో నమోదు కాకపోవడం వివాదస్పదమైంది. అంతేకాదు కార్గిల్లో యుద్దం చేసిన ఓ సైనికుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేర్లు కనిపించకుండా పోవడం కొత్త చర్చకు దారి తీసింది. అదలావుంటే కొంతమంది చిన్నారుల పేర్లు ఉండి.. వారి తల్లిదండ్రుల పేర్లు లేకపోవడం జాతీయ పౌర రిజిస్టర్ లోపాలు కళ్లకు కట్టినట్లైందనే వాదనలు లేకపోలేదు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొలుత అమలు చేయాలనే డిమాండ్
ఎన్ఆర్సీ అమలు విషయంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తొలుత ఎన్ఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా త్రిపురలో మొదట అమలు చేయాలంటూ ఆ మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదించారు. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ పూర్వీకులు భారతీయులు కాకపోవడంతో.. ఎన్ఆర్సీ జాబితా నుంచి ఆయన పేరు తొలగించే అవకాశం ఉంటుందనేది ఆమె వెర్షన్. అందుకే త్రిపురలో ఎన్ఆర్సీ అమలు చేయడానికి ఆలస్యం జరుగుతోందనే కామెంట్ కూడా చేయడం చర్చానీయాంశమైంది. మొత్తానికి ఎన్ఆర్సీ అమలు బీజేపీకి సవాల్గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా జాతీయ పౌర రిజిస్టర్ను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమైంది సెంట్రల్ గవర్నమెంట్.












Click it and Unblock the Notifications