కృష్ణపట్నం పోర్టులో మందు తయారీకి ఆనందయ్య సన్నాహాలు, సొంత భవనానికి భూమిపూజ: ప్రెస్ రివ్యూ

కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ ప్రయత్నాలు మొదలుపెట్టారని సాక్షి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మందును భారీగా తయారుచేసి 13 జిల్లాలకు పంపి కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు.

మందు తయారీ, పంపిణీ క్యాంపును కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ కోసం ఒక బ్లాక్‌ కేటాయించారు.

భారీ గ్రైండర్, వంటపాత్రలు, మందు తయారీకి దినుసులను సమకూరుస్తున్నారు. 60 వేలమందికి సరిపడా మందును ఆదివారం రాత్రి తయారు చేసి, 13 జిల్లాలకు సోమవారానికి పంపాలని యోచిస్తున్నారు.

అవసరమైతే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి తేనె సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

మందుకోసం ఇతర జిల్లాల వారెవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. మందును అవసరమైన వారి చిరునామాకుగానీ, లేదా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారాగానీ అందించేలా చూస్తామన్నారు.

నెల్లూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో మందును పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోమవారం నాటికి మందు పంపిణీని ప్రారంభించి రానున్న రోజుల్లో మరింతగా నిల్వలను సిద్ధం చేసి అన్ని జిల్లాలతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపాలని నిర్ణయించారని పత్రిక రాసింది.

ఆయుర్వేద మందు తయారీకి కావాల్సిన భవన నిర్మాణానికి ఆనందయ్య కృష్ణపట్నంలోని తన స్థలంలో బుధవారం భూమిపూజ చేశారు.

భవిష్యత్తులో రోగులకు వైద్యసేవలు అందించడం, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం కోసం 'ఆనందయ్య సేవా ట్రస్టు'కూ శ్రీకారం చుట్టారని సాక్షి వివరించింది.

త్వరలో అమరావతి నుంచి విశాఖకు రాజధాని- విజయసాయిరెడ్డి

త్వరలో ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారని ఈనాడు దిన పత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించడం తథ్యమని, ఈ ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

అయితే నిర్దిష్టమైన సమయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. కొవిడ్‌ నియంత్రణ, విశాఖ నగర పరిధిలోని అభివృద్ధి పనులపై బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ''మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ కేసులకు, రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే హక్కు ఉంది. చంద్రబాబునాయుడు కూడా కొన్నినెలలు హైదరాబాద్‌లో ఉండే రాష్ట్రాన్ని పరిపాలించారు'' అని విజయసాయిరెడ్డి చెప్పారని పత్రిక రాసింది.

విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులన్నింటినీ వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ముడసర్లోవ పార్క్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారని ఈనాడు వివరించింది.

సీబీఐ కేసు నమోదు

లోన్ యాప్ కేసులో ఈడీ అధికారిపై కేసు నమోదు

తెలంగాణలో లోన్ యాప్ కేసులో ఒక ఈడీ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

మోసగాళ్ల పని పట్టాల్సిన బాధ్యత కలిగిన అధికారి.. వారితోనే కుమ్మక్కయ్యాడు. ఇన్‌స్టంట్‌ రుణాల పేరిట లోన్‌యా్‌పలతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ నిందితులకు.. మరో నేరం చేసేలా సహకరించాడు.

రూ.5 లక్షల లంచం తీసుకొని.. లోన్‌ యాప్‌ కుంభకోణం కేసులో స్తంభింపజేసిన ఫిన్‌వెస్ట్ లోన్‌ యాప్‌ కంపెనీ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలిచ్చాడు.

దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ.. స్వయంగా ఈడీ అధికారే ఈ అవినీతి చర్యకు పాల్పడ్డట్లు గుర్తించింది. బెంగళూరుకు చెందిన ఈడీ అధికారి లలిత్‌ బజాద్‌ కేసు నమోదు చేసింది.

హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ఫిర్యాదు మేరకు ఇన్‌స్ట్టంట్‌ మొబైల్‌ యాప్‌ లోన్‌ వ్యవహారంపై ఈడీ బెంగళూరు శాఖ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.

కాగా, కేసు దర్యాప్తు అధికారిగా బెంగళూరు ఈడీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ మనోజ్‌ మిట్టల్‌ రాగా.. లలిత్‌ బజాద్‌ ఆయనకు సహాయకుడిగా ఉన్నారు.

విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి ఫిబ్రవరి 9న హాజరు కావాల్సిందిగా ముంబైకి చెందిన అపోలో ఇన్వెస్ట్‌ ఎండీ మిఖిల్‌ ఇన్నానీకి లలిత్‌ ఈ-మెయిల్‌ రూపంలో సమన్లు జారీ చేశారు.

అదే రోజు మిఖిల్‌ మరో ఇద్దరితో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ముగ్గురూ కలిసి బెంగళూరు నుంచి ఒకే విమానంలో ముంబైకి చేరుకున్నారు.

బెంగళూరు పబ్‌లో లలిత్‌కు మిఖిల్‌ రూ.5 లక్షలు ఇచ్చాడు. హోసూరుకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి సుని సూచన మేరకు భాటికి జైన్‌ ఆ డబ్బును ఇచ్చాడు. మిఖిల్‌ బంధువు కోరిక మేరకు ఈ వ్యవహారమంతా నడిచినట్టు సీబీఐ పేర్కొంది.

దీంతో అపోలో ఫిన్‌వెస్ట్ బ్యాంక్‌ ఖాతా ఫిబ్రవరి 16న డీఫ్రీజ్‌ అయినట్టు సీబీఐ తెలిపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రుణాల యాప్‌ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు జైల్లో ఉండి కూడా బయట చక్రం తిప్పుతున్నట్లు అనుమానాలున్నాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

కరోనా థర్డ్ వేవ్

సెకండ్ వేవ్ లాగే థర్డ్ వేవ్ ఉంటుంది-ఎస్‌బీఐ నివేదిక

మూడో వేవ్ 98 రోజులపాటు కొనసాగవచ్చని ఎస్‌బీఐ తన నివేదికలో చెప్పినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

త్వరలో రానున్నట్లు అంచనా వేస్తున్న కరోనా థర్డ్‌వేవ్‌ కూడా సెకండ్‌వేవవ్‌లాగే తీవ్రంగా ఉండే అవకాశముందని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

ఇది 98 రోజులపాటు కొనసాగవచ్చని తెలిపింది. థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తుగా సిద్ధమై ఉండాలని, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది.

తద్వారా సీరియస్‌ కొవిడ్‌ కేసులను కూడా సులభంగా ఎదుర్కోగలమని, ఆక్సిజన్‌, బెడ్లు, ఐసీయూల అవసరం భారీగా తగ్గుతుందని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

అంతేగాక కరోనా మరణాలను కూడా భారీగా తగ్గించవచ్చని వెల్లడించింది. 'థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

కాబట్టి వాళ్లను దృష్టిలో ఉంచుకొని మనం వ్యూహాలు రూపొందించుకోవాలి. కొన్ని దేశాలు పిల్లలకు టీకాలు వేయడానికి భారీగా వ్యాక్సిన్లను కొనుగోలు చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ముందస్తుగా టీకాలను కొనుగోలు చేసుకోవడం మంచింది' అని ఎస్‌బీఐ తన నివేదికలో వివరించిందని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+