మద్య నిషేధం కోసం ఉద్యమించబోతున్న అన్నా హజారే
పుణే : నల్లధనంపై భారీ ఎత్తున పోరాటం చేసి దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరి దృష్టిలో నిలిచిపోయిన ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటిదాకా నల్లధనం, అవినీతిపై పోరుబాట పట్టిన ఆయన.. ఇకనుంచి మద్య నిషేధం కోసం ఉద్యమిస్తున్నట్టుగా ప్రకటించారు.
మహారాష్ట్రలో మద్య నిషేధం కోసం త్వరలోనే ఆయన పోరుబాట పడుతున్నట్టు ప్రకటించారు. మద్యపానం వల్ల కుటుంబాలు అదోగతి పాలవుతున్నాయని, మహిళలు వేధింపుల పాలవుతున్నారని అన్నా ఆవేదన వ్యక్తం చేశారు. పుణేలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హజారే.. అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో ఈ కామెంట్స్ చేశారు.
మద్య నిషేధం కోసం ఇప్పటికే ముసాయిదాను సిద్దం చేశామని చెప్పిన హజారే.. ఇందుకోసం అత్యంత పటిష్టమైన చట్టాలను తీసుకురావాలన్నారు. ముసాయిదాను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సమర్పించబోతున్నట్టుగా పేర్కొన్నారు. మద్య నిషేధంపై ఫడ్నవీస్ కూడా సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. ముసాయిదాను బలపరిచేందుకు తమకు తోడ్పాటును అందించాల్సిందిగా కేంద్రం హోంశాఖ ముఖ్య కార్యదర్శి మాధవ్ గాడ్ బొలేను హజరే కోరడం గమనార్హం.