omicron: ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు; దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో థర్డ్ వేవ్ టెన్షన్
భారత దేశాన్ని ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం సృష్టిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓమిక్రాన్ వేరియంట్లో రెండో కేసు నమోదైంది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ గత ఆదివారం నాడు, కొత్త వైరస్ యొక్క మొదటి కేసును ధృవీకరించారు. తాజాగా మరో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కలిగిస్తుంది.
ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు
ఈ వారం జింబాబ్వే నుండి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి నుండి తీసుకున్న నమూనా యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ ఓమిక్రాన్ వేరియంట్ను కలిగి ఉందని అధికారులు నిర్ధారించారు. రోగి ప్రయాణ చరిత్ర ప్రకారం, అతను ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. ఆ తరువాత జింబాబ్వే నుండి ఢిల్లీకి వచ్చాడు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయిన రోగిని దేశ రాజధానిలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (LNJP)లో చేర్చారు. అక్కడ ఓమిక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33
ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరిన 27 మంది విదేశీ ప్రయాణికుల జీనోమ్ సీక్వెన్సింగ్ను ఇప్పటివరకు నిర్వహించామని, అందులో 25 నమూనాలు నెగెటివ్గా ఉన్నాయని, ఇద్దరు వ్యక్తుల నమూనాలలో ఓమిక్రాన్ కనుగొనబడిందని అధికారిక ప్రకటన తెలిపింది. దీనితో, భారతదేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి పెరిగింది.
శుక్రవారం నాటికి దేశంలో 32 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యంత పరివర్తన చెందిన కరోనావైరస్ యొక్క ఏడు కొత్త ఇన్ఫెక్షన్లు కనుగొనబడ్డాయి . ఇదే సమయంలో గుజరాత్ రాష్ట్రంలో మరో రెండు కేసులు గుర్తించారు.
మహారాష్ట్రలో 144 సెక్షన్; కర్ణాటకలో తీవ్ర ఆంక్షలు
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలలో భాగంగా శనివారం నుండి రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. .సమావేశాలు,ర్యాలీలు నిర్వహించకుండా, ప్రజలు గుంపులు గా ఉండకుండా ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ దెబ్బకు కర్ణాటక ప్రభుత్వంకూడా ఇప్పటికే ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకోని వారిని సినిమా హాళ్లు, మాల్స్లోకి ప్రవేశించడానికి అనుమతించరని వెల్లడించింది.
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ లో డేంజరస్ మ్యూటేషన్స్ .. థర్డ్ వేవ్ భయం
ఇదిలా కొత్తగా గుర్తించిన కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ ఇతర వేరియంట్లతో పోల్చితే మరింత వ్యాప్తి చెందుతుందా లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో అత్యధికంగా వ్యాపించే మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న డెల్టా వేరియంట్ కూడా ఉంది ఈ కారణంగా అది ఎలా ఉత్పరివర్తన చెందుతుందో అన్న ఆందోళన నెలకొంది.
ఈ వేరియంట్ లో జరుగుతున్న డేంజరస్ మ్యూటేషన్ ప్రస్తుత టెన్షన్ కు కారణంగా మారుతుంది. ఏది ఏమైనా భారత్ కు ఒమిక్రాన్ దెబ్బకు థర్డ్ వేవ్ వస్తుందేమో అన్న ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.