Today in Parliament : ఆ మంత్రిని తొలిగించే దాకా - సభలో యాంటీ డోపింగ్ బిల్లు : సభ్యుల ప్రయివేటు బిల్లులు..!!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు సైతం లఖింపూర్ ఖేరీ ఘటన పైనే ప్రతిపక్షాలు నిరసనకు దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటన పైన సిట్ నివేదికతో ఒక్కసారిగా విపక్షాలు దీని పైన చర్చకు పట్టు బడుతున్నాయి. ఉభయ సభల్లోనూ ఇదే అంశం పైన ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తున్నారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందంటూ సిట్ దర్యాప్తులో వెల్లడికావడంపై పార్లమెంట్లో చర్చ సాగించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి.
లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చించాలంటూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపి మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. ఇటు రాజ్యసభలో తృణమూల్ ఎంపి సుస్మితా దేవ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ... గురువారం లోక్సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనలో మంత్రి అజయ్ మిశ్రానే నిందితుడని.. వెంటనే అతడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాల సభ్యులు ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి... వెల్లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. దీంతో..ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ రోజు సభలోనూ ఇదే అంశం పైన ప్రతిపక్షాలు నిలదీసే ఛాన్స్ ఉంది. ఇక, ప్రశ్నోత్తరాల తరువాత స్టాండింగ్ కమిటీ నివేదికలను సభ ముందు ఉంచనున్నారు. ప్రభుత్వం నుంచి ది నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు -2021 ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో పాటుగా ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సవరణ బిల్లు ,2021 ను మంత్రి సభలో ప్రతిపాదించనున్నారు.
ఇక, బడ్జెట్ అంచనాల్లో సవరణలకు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆమోదం కోరనున్నారు. వీటితో పాటుగా కేంద్రం లోక్ సభలో ఆమోదించుకున్న బిల్లులను రాజ్యసభలో చేసిన సవరణకు సభ ఆమోదం తెలపనుంది. ఇక, ప్రతీ శుక్రవారం సభ్యులను ప్రయివేటు బిల్లులను ప్రవేశ పెట్టేందుకు అనుమతి ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు సైతం సభ్యులు పలు ప్రయివేటు బిల్లులను సభ ముందు ఉంచనున్నారు.












Click it and Unblock the Notifications