అనూహ్య కేసు: పేరెంట్స్ విచారణ, సుఫారీ కోణంలోను..
విజయవాడ/ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో ముంబై పోలీసులు సోమవారం అనూహ్య తల్లిదండ్రులను విచారించారు. తల్లిదండ్రులు సింగవరపు జోనీ ప్రసాద్, జ్యోత్స్నను కలిసి విచారించారు. అనూహ్యకు సంబంధించిన పూర్తి వివరాలను వారి నుండి సేకరించారు.
గత నెల 4న మచిలీపట్నం నుండి ముంబై వెళ్ళిన అనూహ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనూహ్య హంతకులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో ముంబై కుంజుమార్గ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అశోక్, ఇద్దరు కానిస్టేబుళ్లు దర్యాప్తులో భాగంగా పట్టణానికి వచ్చి అనూహ్య తల్లిదండ్రులు, బందరు డిఎస్పీతో సమావేశమయ్యారు.
అనూహ్య ముంబైలో రైలు దిగిన తర్వాత ఓ మధ్య వయసు గల వ్యక్తి ఆమె బ్యాగులు తీసుకెళుతుండగా అతని వెనక మరో ఇద్దరు అనుసరించినట్లు సిసి కెమెరాల్లో నమోదయింది. ఆ ముగ్గురు వ్యక్తులను గుర్తుపట్టగలరా..? అంటూ సిసి కెమెరా రికార్డింగ్స్ను పోలీసులు అనూహ్య తల్లిదండ్రులకు చూపించారు.
మచిలీపట్నంలో ఉన్న రౌడీ షీటర్ల వివరాలను కూడా ముంబై పోలీసులు సేకరించారు. తమతో పాటు మరో బృందం విచారణ కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. మంగళవారం కూడా బందరులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు అనూహ్యను ఎవరైనా సుఫారీ ఇచ్చి హత్య చేయించి ఉంటారా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.