ఇంట్లో నిర్బంధం: వివాదంలో కేంద్రమంత్రి అనుప్రియ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో అతి పిన్న వయస్కురాలైన మంత్రిగా అరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఉన్నారు. ఆమె తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు.
ఢిల్లీలో కొత్త ఇంటిని అనుప్రియ పటేల్ నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులను అనుప్రియ భర్త ఆశిష్ పటేల్ నిర్బంధించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలను మంత్రి అనుప్రియ కొట్టి పారేశారు. తనంటే గిట్టని వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇది రాజకీయ కుట్ర అన్నారు. కాంట్రాక్టర్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్ నరేంద్ర గుప్తను, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ జూనియర్ ఇంజినీర్ను ఇంట్లో బంధించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ.. మంత్రి కుటుంబం తమను పని ఆలస్యం చేస్తున్నారని బంధించారన్నారు.