నీట్, జేఈఈ బాధ్యతల్లోకి ఏపీ ఐఏఎస్ - కేంద్రం కీలక పోస్టు..!
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారికి కేంద్రం ఇవాళ కీలక బాధ్యతల్లో నియమించింది. తాజాగా నీట్ అక్రమాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ (Prasanna venkatesh)ను డైరెక్టర్ గా నియమించింది. దీంతో ఆయన రాష్ట్రాన్ని వీడి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లబోతున్నారు.
2012 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన ప్రసన్న వెంకటేష్ ను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్ గా నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారికి కేంద్రంలో కీలక బాధ్యత దక్కినట్లయింది. అదీ నీట్ అక్రమాల నేపథ్యంలో ముప్పేట విమర్శలు ఎదుర్కొంటున్న జాతీయ టెస్టింగ్ ఏజెన్సీలో డైరెక్టర్ గా ఆయన బాధ్యత చేపట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రసన్న ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

పాడేరు సబ్ కలెక్టర్ గా ఏఐఎస్ కెరీర్ ప్రారంభించిన ప్రసన్న వెంకటేష్.. ఆ తర్వాత ఏపీలో వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా, సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా .. ఇలా చాలా పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యత కొనసాగుతున్న వేళ.. ప్రసన్న వెంకటేష్ నియామకం వెనుక కూటమి సర్కార్ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రసన్న వెంకటేష్ తో పాటు మరో డైరెక్టర్ గా ఏజీఎంయూటీ కేడర్ కు చెందిన రవి కుమార్ సింగ్ ను కూడా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ నియమించింది.













Click it and Unblock the Notifications