రైలు ప్రమాదం: చెదరని లడ్డూ బైబిల్, మద్యం సీసా
అనంతపురం: నాందేడ్ - బెంగళూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం మృతుల లగేజీల్లో విలువైన వస్తువులతో పాటు బంగారం, నగదును స్థానిక పోలీసులు గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ పరిశోధనలో భాగంగా కూపేల వారీగా నమూనాలు సేకరించే క్రమంలో బి-1 కూపేలో కాలిన మూడు ల్యాప్టాప్లతోపాటు పాస్పోర్టు, ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించాయి. అగ్నికీలల్లో బోగీలోని లగేజీ మొత్తం కాలిపోయినప్పటికీ ఒక ప్రయాణికుని సూట్కేస్లోని తిరుపతి లడ్డూ ఏమాత్రం చెక్కుచెదరలేదు.
అదే విధంగా మరో ప్రయాణికుని సూట్కేస్లో బైబిల్ చెక్కుచెదరకుండా ఉండడాన్ని గమనించారు. బి-1 కూపేలో జనవరి 19న జరగాల్సిన వివాహ పత్రికలతోపాటు బంగారు గాజులు, గొలుసులు, ఉంగరాలు, వెయ్యి రూపాయల నోట్లు లభ్యమయ్యాయి. బి-2 కూపేలో మాంసపు ముద్దలు కనిపించాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి అవయవాలు అక్కడక్కడ పడి ఉండడాన్ని ఫోరెన్సిక్ బృందం గమనించింది. ప్రమాదం జరిగిన తీరునుబట్టి చూస్తే ఏసి బోగీలో స్పాంజ్ మూలంగా వేగంగా మంటలు వ్యాపించినట్లు అర్థమవుతోందని అంటున్నారు.

నాందేడ్ రైలు ప్రమాదం ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఫోరెన్సిక్ నిపుణుల బృందానికి ఆదివారం సాయంత్రం కాలిపోయిన బోగీలో మద్యం సీసా, క్రిమిసంహారక మందు లభించాయి. నిపుణుల బృందం ఉదయం నుండి కూపేల వారీగా పరిశీలించి సుమారు 77 సంచుల్లో పరిశోధనకు అవసరమయ్యే ఆధారాలను భద్రపరిచారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుని సంచి నుండి బాక్టీరియా సైడల్ క్రిమిసంహారక పేస్టు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా మద్యం సీసాపై ఓసి బాటిల్ లేబుల్ ఉన్నట్లు గుర్తించారు.
క్రిమిసంహారక పేస్టు కర్ణాటక ఆగ్రో కెమికల్ లిమిటెడ్ సంస్థకు చెందినదిగా గుర్తించినట్లు డైరెక్టర్ శారద తెలిపారు. అయితే ఆ ప్రయాణికుడు ఓ పెస్టిసైడ్ సంస్థ నుంచి పొందిన ప్రశంసాపత్రం ఆ లగేజీలో లభించింది. అయితే ప్రశంసాపత్రంపై బసవనగౌడ పాటిల్ అన్న పేరు ఉంది. రైలు ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న బృందానికి లభించిన ఈ నమూనాలను భద్రపరిచి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications