కోర్టులో కూర్చుంది పశువులనుకుంటున్నారా?: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. దేశంలోని కరువు పరిస్థితులపై విచారణ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది. కరువు పరిస్థితిపై తీసుకున్న చర్యలు వివరించేందుకు కేంద్రం తరుపు న్యాయవాదిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'చేసే పనిలో, సమస్య తీవ్రత తెలుసుకోవడంలో సీరియస్ నెస్ చూపించండి... మేం పనికిరాని వాళ్లమని మీ ఉద్దేశమా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సభ్యుడు యోగేంద్ర యాదవ్కు నేతృత్వంలోని స్వరాజ్ అభియాన్ సంస్థ కరువు దుస్థితిని కోర్టుకు వివరిస్తూ దీని నివారణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియజేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రాన్ని కోరినా అలసటత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 12 రాష్ట్రాలు కరువు భారిన పడ్డాయంటే సమస్యను అంత తేలికగా తీసిపారేయలేమని అభిప్రాయపడింది.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా దేశంలోని 12 రాష్ట్రాలు కరువు బారిన పడితే పట్టించుకోరా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. 'ఇదంతా(కోర్టులో ఉన్న సమూహాన్ని ఉద్దేశిస్తూ..) మీ కళ్లకు ఒక పశువుల మందలాగా కనిపిస్తుందా లేక ఇంకేదైననా? ఇక్కడికి అక్కడికి వెళ్లడానికి. ఇది మీకు నచ్చినట్లు చేసే అంశంకాదు' అని అన్నారు.
'ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు కూర్చున్నారు. మీరు మా నుంచి ఏదో ఆశించాల్సిందిపోయి ఏం చేయకుండా మా ముఖాలు చూస్తూ సమయం వృధా చేయడం దేనికి?' అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వచ్చి తాను వాదనలు వినిపించేందుకు సిద్ధమని అన్నారు.
దీంతో పావుగంటలో వాదనలు వినిపించి వెళ్లిపోవాలని ధర్మాసనం తెలిపింది. కోర్టు సమయం చాలా విలువైనదని అన్నారు.