ఉగ్రవాదం వైపా? మానవత్వం వైపా?: పాక్కు మోడీ
దుబాయ్: అమెరికాలోని మాడిసన్ స్క్వేర్, సియోల్, షాంఘైలను తలపించే రీతిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలనూ ఆకట్టుకుంది. దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం సాయంత్రం భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ, ఇరుదేశాల మధ్య సంబంధాలను వ్యాపార వాణిజ్య అనుబంధాన్ని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాద ధోరణిని ఎండగట్టారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం కోసం పట్టుబట్టారు. తనదైన శైలిలో వాక్ఝరీ ప్రవాహంతో మొదలైన మోడీ ప్రసంగం ఆద్యంతం చతురోక్తులతో, విసుర్లతో, వ్యగ్యోక్తులతో సాగింది. ఉగ్రవాదులు ఉగ్రవాదులేనని, వీరిలో మంచి చెడ్డలకు ఆస్కారమే ఉండదని స్పష్టం చేశారు.
‘మీరు ఉగ్రవాదానికి అనుకూలమా? వ్యతిరేకమా? తేల్చుకోవాలి' అంటూ పాక్కు సవాల్ విసిరారు. దుబాయ్ని మినీ ఇండియాగా పేర్కొన్న మోడీ, ఇక్కడ పని చేస్తున్న భారతీయులు మాతృ దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్నారని ప్రశంసించారు. ఏళ్ల తరబడి ఇక్కడ పని చేస్తున్న భారతీయులంతా తమ జీవనోపాధి కోసమే కాకుండా, భారత వృద్ధికి అభృవృద్ధికి కూడా ఎంతగానో పాటుపడుతున్నారని అన్నారు.
భారతదేశం అణుపరీక్ష జరిపిన తర్వాత పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సమయంలో గల్ఫ్ దేశాలు ఏవిధంగా ఆదుకున్నదీ వివరించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అందరూ సహకరించాలన్న అప్పటి ప్రధాని వాజపేయి పిలుపును పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ స్పందించారని తెలిపారు.
ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి నిరుపమానమైన రీతిలో సహాయ సహకారాలు అందాయన్నారు. మిగతా దేశాల్లో ఉంటున్న భారతీయులు అందరికంటే కూడా గల్ఫ్లో పని చేస్తున్న ప్రజలే మాతృదేశానికి ఆదర్శనీయ రీతిలో తోడ్పాటును అందించారన్నారు. ప్రతివారం భారత్ నుంచి దుబాయ్కి ఏడు వందలకు పైగా విమానాల రాకపోకలు జరుగుతాయని, కానీ భారత ప్రధాని రావడానికి 34ఏళ్లు పట్టిందని మోడీ తెలిపారు.
తనకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు యుఏఇ యువరాజు తన ఐదుగురు సోదరులతో కలిసి రావడం, మొత్తం 125 కోట్లమంది భారతీయులకు లభించిన అరుదైన గౌరవం అన్నారు.
అంతేగాక, యుఏఈ సహా అన్ని దేశాల్లోనూ భారత్ పట్ల పెరుగుతున్న ఆసక్తి, ఆదరణకు ఇది నిదర్శనమన్నారు. మతం పేరిట అమాయకులను ఊచకోత కోస్తున్న తరుణంలో యుఏఇలో భారతీయుల కోసం ఓ ఆలయాన్ని నిర్మించేందుకు యువరాజు స్థలాన్ని కేటాయించడం అరుదైన నిర్ణయమన్నారు.
ఇది గొప్ప నిర్ణయమేకాకుండా, భారత్కు ఆయన అందించిన గొప్ప బహుమతి కూడా అన్నారు. ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరిని యుఏఇ బలపరుస్తోందని పేర్కొన్న మోడీ ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని, అందుకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ సందేశాన్నే నేటి సమావేశం ప్రపంచానికి అందిస్తోంది' తెలిపారు.
భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాల్సిందేనంటూ యుఏఈ బలంగానే మద్దతిస్తోందని, ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహానికి సంకేతమని తెలిపారు. ఉగ్రవాదం కారణంగా భారత్ ఎంతగానో నష్టపోయిందన్నారు. మానవత్వానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఇటీవల నాగాలాండ్లో వేర్పాటువాదన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గుర్తు చేశారు. సమస్య ఎంత తీవ్రమైనదైనా దానికి పరిష్కారం అన్నది చర్చామార్గంలోనే సాధ్యమవుతుందని తెలిపారు. భారత దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించటంతోపాటు ఇరుగు పొరుగు దేశాలు అన్నింటితోనూ సుహృద్భావ సంబంధాలను పెంపొందించుకోవటమే తమ లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు.
స్వాతంత్య్రానంతరం తొలిసారిగా బంగ్లాదేశ్తో సరిహద్దుల నిర్ధారణం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడానికి సిద్ధమన్నారు. భారత్లో రెండో హరిత విప్లవాన్ని తీసుకురావాలన్నదే తమ ధ్యేయమన్నారు.
ప్రపంచ దేశాలు అన్నింటినుంచీ వస్తున్న ఆదరణను అవకాశంగా తీసుకుని అభివృద్ధిలో భారత్ కొత్తపుంతలు తొక్కాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కాగా, రెండు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని మోడీ సోమవారం రాత్రి భారత్కు తిరుగుపయనమయ్యారు.