ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్లు.. సీఏఏపై పొలిటికల్ స్టాండ్.. వీరోచిత జవాన్లు గుర్తొస్తారన్న రావత్
పౌరసత్వ సవరణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 31న రిటైర్ కాబోతున్న ఆయన.. కొత్తగా ఏర్పాటుచేసిన 'దళాల సంయుక్త అధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్- సీడీఎస్)' పదవిని చేపట్టబోతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో తాజా కామెంట్లు దుమారంరేపుతున్నాయి.
వీళ్లా నాయకులు..?
‘‘నమ్మినవాళ్లను తప్పుడు మార్గంలో నడిపించేవాళ్లు లీడర్లు కానేకారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో కొంతకాలంగా ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. సీఏఏపై విద్యార్థులందరూ అనుచితర రీతిలో నిరసనలకు దిగడం మనం చూశాం. దేశంలోని అన్ని సిటీలు, పట్టణాల్లో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, వాటికి నిప్పుపెడుతూ ఆందోళనకారులు హింసామార్గంలో పయనించడం మనం గమనించొచ్చు. వాళ్లను అలా నడిపించింది ఎవరు? దీన్ని నాయకత్వమని ఎలా అంటాం? వీళ్లా నాయకులు? ఇంటెలెక్చువల్స్ గా పేరుపొందినవాళ్లు కూడా వీటిని సమర్థించమేంటి? ''అని రావత్ ఫైరయ్యారు.
అక్కడ జవాన్ల పోరాటం.. ఇక్కడ ఇలా..
సీఏఏ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఢిల్లీలో రాత్రి చలిలోనూ నిరసనకారులు బైఠాయించడాన్ని ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు. ఢిల్లీలో నిరసనల్ని చూసినప్పుడు తనకు బోర్డర్ లో సైనికులు గుర్తుస్తారని చెప్పారు. స్వెటర్లు, టోపీలతో చక్కగా ప్రపేర్ అయి నిరసలు చేసేవాళ్లను చూసినప్పుడు.. మైనస్ 10 నుంచి మైనస్ 45 డిగ్రీల చలి ఉండే సియాచిన్ లాంటి ప్రాంతాల్లో వీరోచితంగా విధులు నిర్వహించే జవాన్లు గుర్తుకొస్తారని ఆర్మీ చీఫ్ అన్నారు.
హింసపై ప్రధాని మాట్లాడిన తర్వాతిరోజే..
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హింస చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 మంది చనిపోవడం, పెద్ద ఎత్తున ఆస్తులు విధ్వంసానికి గురికావడం తెలిసిందే. హింసకు పాల్పడ్డ నిరసనకారులు తమను తాము ప్రశ్నించుకోవాలని ప్రధాని మోదీ బుధవారం లక్నోలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు. కొన్ని గంటల తేడాతోనే ఆర్మీ చీఫ్ రావత్ కూడా దాదాపు అదేరకమైన కామెంట్లు చేయడం గమనార్హం.