అనికా చోప్రా హానీ ట్రాప్: ఫేస్బుక్లో 50 మంది సైనికులకు ఎర
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వేదికగా ఓ యువతి దాదాపు యాభై మంది సైనికులకు ఎరవేసింది. వారి వద్ద నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టాలని ప్రయత్నాలు చేసింది. ఓ జవాను ఆమె మాటలకు లొంగిపోయి, అడిగిన సమాచారం ఇచ్చాడు. ఆమె పేస్బుక్ అకౌంట్లో సంప్రదాయ కట్టులో, అందంగా ఉన్న ఆమెను చూసి బుక్కయ్యాడు. మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని ఆమెకు ఇచ్చాడు.
కానీ ఊహించని విధంగా జవానను అరెస్ట్ చేసారు. తన అరెస్టుతో ఆ జవానుకు అసలు విషయం తెలిసింది. ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థకు చెందిన ఏజెంట్ అని తెలిసింది. ఫేస్బుక్ అకౌంట్లో అనికా చోప్రా అని రాసి, తాను మిలిటరీ నర్సింగ్ కార్ప్స్కు కెప్టెన్ అని ప్రొఫైల్లో ఆమె పేర్కొంది.
ఆర్మీ జవాన్ సోమ్ వీర్ సింగ్కు 2016లో ఫేస్బుక్ ద్వారా ఆ పాకిస్తాన్ ఏజెంట్ పరిచయం అయింది. తనకు ఆర్మీ అంటే ఇష్టమని అతనితో మాటలు కలిపింది. అతనితో చాలా క్లోజ్గా మాట్లాడింది. ఆ తర్వాత జవాన్ల స్థావరాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేసింది. చనువు పెరిగింది.
మీ భార్యకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోమని ఆమె.. అతనితో చెప్పింది. బెదిరించే ప్రయత్నాలు చేసింది. అయితే గత కొద్ది రోజులుగా సోమ్ వీర్ సింగ్ ప్రవర్తనలో తేడాను తోటి జవాన్లు గమనించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
వారు సోమ్ వీర్ సింగ్ సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ పైన నిఘా ఉంచారు. అనికా చోప్రాతో జరిగిన సంభాషణ తెలుసుకున్నారు. సోమ్ వీర్ సింగ్ ఆమెకు ఆర్మీకి సంబంధించిన పలు విషయాలు చెప్పినట్లుగా గుర్తించారు. అనిక పేరుతో అవతలి నుంచి చాటింగ్ చేసేది పాకిస్తాన్ ఐటీ నుంచి అని గుర్తించారు. జవానును అరెస్టు చేశారు. విచారణలో సోమ్ వీర్ సింగ్తో పాటు మరో దాదాపు యాభై మంది జవాన్లకు వల విసిరినట్లుగా తేలింది. వారితో చాట్ చేసినట్లుగా గుర్తించారు.