చిల్ సార్.. నా భార్య కూడా అన్ని లెటర్స్ రాయలేదు- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రివాల్ ఫైర్..
ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకూ మధ్య వార్ ముదురుతోంది. కేజ్రివాల్ సర్కార్ పై నిత్యం విమర్శలు చేస్తూ గవర్నర్ రాస్తున్న లేఖలు సీఎంకు చికాకు పుట్టిస్తున్నాయి. దీంతో కేజ్రివాల్ లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై వ్యంగాస్త్రాలు సంధించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ శాంతించాలని కేజ్రివాల్ కోరారు. తన భార్య కూడా తనకు అన్ని లేఖలు రాయలేదని సక్సేనాను ఉద్దేశించి కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఎల్జీ సాహిబ్ రోజూ తిట్టినంతగా నా భార్య కూడా తనను తిట్టదన్నారు. గత ఆరు నెలల్లో, ఎల్జీ తనకు రాసిన ప్రేమ లేఖల సంఖ్య చూస్తే తన జీవితకాలంలోనూ తన భార్య అన్ని రాయలేదని కేజ్రివాల్ తెలిపారు. ఎల్-జి సాహిబ్ కొంచెం కూల్ గా ఉండండి, అలాగే దయచేసి మీ సూపర్ బాస్కి కూడా కొంచెం శాంతంగా ఉండమని చెప్పండని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున రాజ్ ఘాట్ కు రాకపోవడం పట్ల ఎల్-జి సక్సేనా ఇటీవల కేజ్రీవాల్కు లేఖ రాశారు. అంతకుముందు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్ల నరికివేతకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యంపై కేజ్రీవాల్కు లేఖ రాశారు. ఇలా వరుసగా లేఖలు రాస్తుండటంపై కేజ్రివాల్ తన అసహనం వ్యక్తంచేశారు. ఇలా ప్రతీ అంశంపై లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఏముందని లెఫ్టినెంట్ గవర్నర్ ను ఆయన ప్రశ్నించారు.